ప్రతీ గ్రామాన్ని సందర్శించాలి | Sakshi
Sakshi News home page

ప్రతీ గ్రామాన్ని సందర్శించాలి

Published Wed, Aug 3 2016 10:07 PM

మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు

  •  డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు
  • ఖమ్మం వైద్య విభాగం : ప్రతీ గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందించి సీజనల్‌ వ్యాధులు రాకుండా నిర్మూలించాలని డీఎంహెచ్‌ఓ ఏ. కొండల్‌రావు సిబ్బందిని ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో బుధవారం సీజనల్‌ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సూపర్‌వైజర్స్, సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో పనిచేస్తున్న సూపర్‌వైజర్స్, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్స్, ఆశ వర్కర్లతో టీమ్‌గా ఏర్పడి, ఒక్కో గ్రామాన్ని సందర్శించి ఇంటింటికి తిరిగి సర్వే చేసి రక్త పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలన్నారు. గ్రామాలు, సబ్‌సెంటర్లు, పాఠశాలల్లో చికిత్స అందించే ఫొటోలు తీసి వాట్సప్‌ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో వెయ్యి టీమ్‌లు ఏర్పడేటట్లు ప్రణాళికలు తయారు చేయాలన్నారు.   ప్రతీ టీం కనీసం 10 రక్త పూతలు తీసి పరీక్షలు నిర్వహించాలని, తద్వారా వచ్చిన మలేరియా కేసులకు వెంటనే చికిత్స అందించే వీలుంటుందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది కలిసి టీం వర్క్‌ చేసినట్లైతే జిల్లాలో రోజుకు 1000 గ్రామాలు సందర్శించి, అక్కడ ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి, వ్యాధులను అరికట్టి జిల్లాను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా సర్వేలెన్స్‌ అధికారిణి డాక్టర్‌ కోటిరత్నం, జిల్లా మలేరియా అధికారి ఏ. రాంబాంబు, డెమో వెంకన్న, డీహెచ్‌ఈ జి. సాంబశివారెడ్డి, పారామెడికల్‌ సిబ్బంది, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
     
     

Advertisement
Advertisement