- నిర్వాసితులపై సమస్యలపై ఆందోళన
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
బోయినపల్లి : ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్మానేరు రిజర్వాయర్ కట్టకు గండి పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం మిడ్మానేరు రిజర్వాయర్ గండిని పరిశీలించారు. బోయినపల్లి మండలం మాన్వాడ, సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామాల్లోని ముంపు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంబంధిత కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేసినా కమీషన్ల కక్కుర్తితో పాలకులు పట్టించుకోలేదన్నారు. దీంతో కట్ట నిర్మాణంలో నాణ్యత లోపించి గండి పడిందన్నారు. నాలుగు టీఎంసీల నీరు వథాగా పోయిందని, వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో ముంపు గ్రామాల్లోకి నీళ్లు వచ్చాన్నారు. ఒక్కో కుటుంబం రూ.10వేలు ఖర్చు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయన్నారు. ప్రభుత్వం వెంటనే మిడ్మానేరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంతోపాటు వరద బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పదిరోజుల్లో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే సీపీఐ ఆధ్వర్యంలో కలక్టరేట్ను ముట్టడిస్తామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్రెడ్డి, గుండా మల్లేశ్ తదితరులున్నారు.