గ్యాంగ్‌స్టర్‌ మధుతో ‘పల్లె’ దోస్తీ! | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్టర్‌ మధుతో ‘పల్లె’ దోస్తీ!

Published Thu, Oct 20 2016 9:54 PM

గ్యాంగ్‌స్టర్‌ మధుతో  ‘పల్లె’ దోస్తీ! - Sakshi

– బెంగళూరు కేంద్రంగా మధు సెటిల్‌మెంట్లు, భూదందాలు
– భూదందాలో రియల్టర్‌ మంజునాథ్‌తో విభేదాలు
– మధును కిడ్నాప్‌ చేసి చితకబాదిన మంజు గ్యాంగ్‌
– సోషల్‌ మీడియాలో కలకలం రేపుతున్న మధు వీడియోలు
– మధుతో మంత్రి పల్లెతో పాటు మరికొందరు టీడీపీ నేతలకు సంబంధాలు
– గ్యాంగ్‌స్టర్‌ భానుకిరణŠ కూ మధు సన్నిహితుడు.. మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన సాక్షి
– సూరి హత్యకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించినట్లు సమాచారం!
– పూర్తి వీడియోను బయటపెడితే వెలుగులోకి వాస్తవాలు..


(సాక్షిప్రతినిధి, అనంతపురం) అనంతపురం జిల్లాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ ఎర్లంపల్లి మధు వ్యవహారాలకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండగా నిలిచారా? మంత్రి మద్దతుతోనే మధు సెటిల్‌మెంట్లు, భూదందాలు నిర్వహించారా? పల్లెతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు అతని అండతో సెటిల్‌మెంట్లు చేశారా? సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న మధు వీడియో, దాని వెనుక ఉన్న పరిణామాలు బేరీజు వేస్తే అవుననే సమాధానం వస్తోంది. ఈ వీడియో ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో రెండురోజులుగా హల్‌చల్‌  చేస్తోంది.

ఎవరీ మధు?
        ఎర్లంపల్లి మధు  పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం ఎర్లంపల్లి వాసి. మద్దెలచెరువు సూరి కారు డ్రైవర్‌గా ఉండేవాడు. భానుకిరణ్‌.. సూరిని కారులో తుపాకీతో కాల్చి చంపిన సమయంలోనూ మధునే కారుడ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా పలుసార్లు కోర్టుకు హాజరయ్యాడు. సూరి హత్య తర్వాత భానుకిరణ్‌ అనుచరునిగా ఉంటూ బెంగళూరుకు మకాం మార్చాడు. భాను పేరుతో సెటిల్‌మెంట్లు, భూదందాలు చేస్తుండేవాడు. తర్వాత మంత్రి పల్లె రఘునాథరెడ్డి తనకు సన్నిహితుడని  చెబుతూ దందాలు చేసేవాడు. మంత్రి పల్లె కూడా సహకరించేవారనే ఆరోపణలున్నాయి. మంత్రితో పాటు ‘అనంత’కు చెందిన మరికొంతమంది టీడీపీ నేతలు సెటిల్‌మెంట్లు, భూదందాలకు సంబంధించిన వ్యవహారాలను మధుతో పరిష్కరిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

మధును కిడ్నాప్‌ చేసిన బెంగళూరు రియల్టర్‌ మంజునాథ్‌
    బెంగళూరుకు చెందిన రియల్టర్‌ మంజునాథ్‌కు సంబంధించిన రూ.50 కోట్ల   భూమి వ్యవహారంలో మధు జోక్యం చేసుకున్నాడు. పక్కకు తప్పుకోవాలని మంజునాథ్‌ గ్యాంగ్‌  హెచ్చరించినా వినలేదు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట మధు వాకింగ్‌ చేస్తుండగా.. మంజునాథ్‌ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేసి, అజ్ఞాతంలోకి తీసుకెళ్లింది. దుస్తులు ఊడదీసి చితకబాదింది. సెటిల్‌మెంట్లు చేస్తావా? మా విషయంలో జోక్యం చేసుకుంటావా? అని తిడుతూ చావబాదారు.  దెబ్బలు తట్టుకోలేక మధు తప్పయిపోయిందని, వదిలిపెట్టాలని, మళ్లీ సెటిల్‌మెంట్ల జోలికి వెళ్లనని విలపించాడు. ఈ దశ్యాలన్నీ మంజునాథ్‌ గ్యాంగ్‌ సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడవి హల్‌చల్‌ చేస్తున్నాయి.

పల్లె సమక్షంలో టీడీపీలో చేరిక
2014 ఎన్నికలకు ముందు పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో మధు టీడీపీ కండువా వేసుకున్నాడు. ఎన్నికల్లో పల్లె విజయానికి కషి చేశాడు. పల్లె బెంగళూరుకు వెళితే అక్కడ మధునే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు  చూసేవాడని తెలుస్తోంది. పలు సెటిల్‌మెంట్లను కూడా మధుతో పల్లె చేయించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మధు వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడంతో అతనితో పల్లె రఘునాథరెడ్డి సంబంధాలు, భూదందాలపై జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. అనంతపురం జిల్లాలో పల్లెకు వందల ఎకరాల భూములు ఉన్నాయని, వీటిని గ్యాంగ్‌స్టర్‌ మధు అండతోనే పంచాయితీలు చేసి కారుచౌకగా కొట్టేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

పల్లె ఏమన్నారంటే..
        మధుతో సంబంధాలపై మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. అతనితో తనకు పరిచయం ఉందని, ఎన్నికల్లో తన విజయానికి సాయం చేశారని అంగీకరించారు. అయితే.. నేరాలు, గూండాయిజాన్ని తాను ప్రోత్సహించలేదన్నారు. బెంగళూరుకు వెళ్లినపుడు మీకు ఏర్పాట్లన్నీ మధునే చేస్తారంటకదా అనే ప్రశ్నకు బదులిస్తూ...తాను బెంగళూరుకు వెళితే హలో అంటే హలో అంటానన్నారు.

సూరి హత్య విషయాలనూ వెల్లడించిన మధు?
బెంగళూరుకు చెందిన మంజునాథ్‌ గ్యాంగ్‌ మధును చితకబాదుతూ సూరిని ఎలా, ఎందుకు హత్య చేశారో చెప్పాలని కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను కూడా  వెల్లడించినట్లు సమాచారం. ఈ వీడియో వెలుగులోకి వస్తే సూరి హత్య సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మధు వెల్లడించిన అంశాలు కీలకంగా మారే అవకాశముంది. ఈ విషయం ప్రస్తుతం అనంతపురంలో కలకలం రేపుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement