రోజూ వేధించేకన్నా.. కాల్చి చంపేయండి | Sakshi
Sakshi News home page

రోజూ వేధించేకన్నా.. కాల్చి చంపేయండి

Published Sun, Jul 10 2016 1:19 AM

రోజూ వేధించేకన్నా.. కాల్చి చంపేయండి - Sakshi

ప్రజల తరఫున ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా?: చెవిరెడ్డి

 సాక్షి, చిత్తూరు : ‘‘ప్రజల తరుఫున పోరాటం చేస్తే అరెస్టులా? జనం సమస్యలు ప్రశ్నిస్తే నిర్భంధమా? అధికార దుర్వినియోగం సరికాదంటే అణచి వేస్తారా? దివంగత సీఎం వైఎస్సార్ వారసులుగా, జగనన్న సైనికులుగా ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతూనే ఉంటాం. కేసుల్లో అక్రమంగా ఇరికించి జైలు పాలు చేయడం తప్ప ఇంకేం చేయగలరు? ఏం చంపుతారా? రోడ్డుపైనే కాల్చి చంపేయండి’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లా జైలులో అక్రమ నిర్భంధంలో ఉన్న భాస్కర్‌రెడ్డి శనివారం ఉదయం 7.45 గంటలకు బెయిల్‌పై విడుదలయ్యారు. తిరుపతి సబ్‌కలెక్టర్ ఆఫీసు ఎదుట రెండు రోజుల క్రితం ధర్నా నిర్వహించినందుకు తిరుపతి ఎమ్మార్‌పల్లి పోలీసులు వెంటనే మళ్లీ అరెస్టు చేశారు. ఆ తర్వాత తిరుపతి కోర్టులో హాజరు పరచగా, మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు మేరకు ఆయనను కడప కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

 కక్షసాధింపే...: ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డిని 20 మందితో కూడిన సాధారణ బ్యారక్‌లో ఉంచడం కక్ష సాధింపేనని చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. చెవిరెడ్డి చంద్రగిరిలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం చేపడితే సొంతగడ్డలోనే టీడీపీ ఉనికి కోల్పోతుందని భయంతోనే చంద్రబాబు ఇలాంటి తప్పుడు కేసులను బనాయిస్తున్నారని వారు దుయ్యబట్టారు.

Advertisement
Advertisement