నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లె రాక
హంద్రీనీవా కాలువ పనుల పరిశీలన
మదనపల్లె: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు రెండేళ్లవుతోంది. ఎన్నికల సమయంలో మోదీ, పవన్కల్యాణ్ను వెంటబెట్టుకొచ్చి ఎన్నో హామీలు గుప్పించ్చారు. వీటిలో ఏఒక్కైనా నెరవేర్చారా? అంటూ మదనపల్లె ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హంద్రీ-నీవాను పూర్తి చేసి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మిస్తామన్నారు. అదేవిధంగా టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటికోఉద్యోగం ఇస్తానన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానన్నారు. వీటిలో ఏఒక్కటీ అమలు కాలేదు. ఈసారి ఏం హామీలు ఇస్తారు? ఏవేవి నెరవేరుస్తారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
సీఎం పర్యటన కు మస్తాన్ వర్గం దూరం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మదనపల్లెలో నిర్వహించనున్న హంద్రీనీవా కాలువ పరిశీలన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముస్లిం నాయకులు బహిష్కరించనున్నారు. మదనపల్లెకి ఇన్చార్జ్ను నియమించడంలో చంద్రబాబు చేస్తున్న జాప్యం, పట్టణంలోని ఇందిరానగర్లో షాదీమహల్ నిర్మాణం ఇప్పటి వరకూ పూర్తికాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమైన ఎస్ఏ మస్తాన్ను వివరణ కోర గా సీఎం కార్యక్రమానికి తాను, తన వర్గం నాయకులు వెళ్లరని స్పష్టం చేశారు.