కాకినాడ : కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుని ఆ వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాశారు. ఆ లేఖను ముద్రగడ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన విడుదల చేశారు. టీడీపీ ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు తన పోరాటం ఆపనని ముద్రగడ ఆ లేఖలో స్పష్టం చేశారు.
హామీల అమలుపై ఎదురు దాడి చేయడం ఆపి... సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని చంద్రబాబుకు ముద్రగడ సూచించారు. రాజస్థాన్, హర్యానా మాదిరిగా శాసనసభలో తీర్మానం చేసి.. రిజర్వేషన్ల అమలు దిశగా ముందుకు వెళ్లాలని ఆయన చంద్రబాబుకు హితవు పలికారు. మరోసారి తనను రోడ్డెక్కే ప్రయత్నం మాత్రం చేయకండని..చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.