నయీమ్‌ అనుచరులు నన్నుచంపుతామన్నారు | Sakshi
Sakshi News home page

నయీమ్‌ అనుచరులు నన్నుచంపుతామన్నారు

Published Tue, Aug 30 2016 8:03 PM

మాట్లాడుతున్న బీజేపీ శంకర్‌రెడ్డి - Sakshi

బడంగ్‌పేట్‌: నయీమ్‌ పెట్టుబడి పెట్టిన ఫ్రైడ్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ సంస్థ జోలికొస్తే అంతం చేస్తామని అతని అనుచరులు తనను బెదిరించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  కొలన్‌ శంకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్‌పేటలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది జూన్‌ 26న సరూర్‌నగర్‌ మండల కార్యాలయం వద్ద ఉన్న తన వద్దకు నల్లగొండకు చెందిన రియాజ్, ఫ్రైడ్‌ ఇండియా ఎండీ సానోవర్‌బేగ్, జుబేర్, మల్లెల శ్రీకాంత్‌గౌడ్‌ (నల్లగొండ), ముజమిల్‌బాబా అలియస్‌ సీతారాంరెడ్డి (వరంగల్‌)తోపాటు మరో ఇద్దరు తనవద్దకు వచ్చి తుపాకీ చూపి బెదిరించినట్లు తెలిపాడు.

భయాందోళనకు గురైన తాను విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారి సూచన మేరకు సీపీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశానని, అయినా ఏలాంటి చర్యలు తీసుకోలేదన్నాడు. బాలాపూర్‌ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఫ్రైడ్‌ ఇండియా పేరుతో వెంచర్లు వేశారని, దేవతల గుట్టపై ఉన్న దేవాలయ స్థలాలను అక్రమించుకున్నారన్నారు. దేవతల గుట్ట పరిరక్షణకు పోరాడుతున్న తనపై బెదిరింపులకు పాల్పడ్డారన్నాడు. ఫ్రైడ్‌ ఇండియాలో నయీమ్‌ పెట్టుబడులు పెట్టినట్లుగా స్వయంగా అతని అనుచరులే  చెప్పారని తెలిపారు.

‘రూ. కోటి ఇస్తాం తప్పుకో, లేదా ప్రాణం మీద తీపి ఉంటే ఫ్రైడ్‌ ఇండియా జోలికి రావొద్దు అని తుపాకీ గురిపెట్టారన్నారు.  దీనిపై పోలీసు ఉన్నతాధికారులు, సిట్‌ ఇన్‌చార్జి నాగిరెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ‘ఫ్రైడ్‌ ఇండియా’పై సీబీసీఐడీ  దర్యాప్తు జరిపించి నయీం అనుచరులను అరెస్టు చేయాలని కోరాడు. సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి, గుర్రం మల్లారెడ్డి, నిమ్మల శ్రీకాంత్‌గౌడ్, పి.పుల్లారెడ్డి, ప్రభాకర్, భాస్కర్, నరేందర్‌గౌడ్, నాగార్జున మహేందర్‌రెడ్డి, విఘ్నేష్, చారి పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement