నెల్లూరు(లీగల్) : కక్షిదారుల కోసం న్యాయమూర్తులు న్యాయవాదులతో కలసి పని చేసేందుకు సంసిద్ధంగా ఉంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మౌలానా జునైద్ అహ్మద్ అన్నారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన బార్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. న్యాయవాది పి.వినయ అందించిన శాస్త్రీయ సంగీతం అలరించింది. న్యాయవాదుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో బార్ అధ్యక్షుడు ఫణిరత్నం, ప్రధాన కార్యదర్శి ఆర్.రోజారెడ్డి, ఉపాధ్యక్షుడు కుడుముల రవికుమార్, జాయింట్ సెక్రటరీ రమణారెడ్డి, కోశాధికారి సుభాన్, ముగ్గురు సీనియర్ రెప్రజెంటేటివ్లు, 5 మంది జూనియర్ రెప్రజెంటేటివ్లు, లైబ్రరీ సెక్రటరీ, లేడీ రెప్రజెంటేటివ్లు ప్రమాణస్వీకారం చేశారు. బార్ అధ్యక్షుడు ఫణిరత్నం, ప్రధాన కార్యదర్శి రోజారెడ్డి మాట్లాడుతూ తమను గెలిపించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ముందుంటామని హామీ ఇచ్చారు. అదనపు జిల్లా జడ్జిలు శ్యామలాదేవి, పాపిరెడ్డి శ్రీరామచంద్రమూర్తి, కిష్టప్ప, మధుసూదన్రావు, మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి భూపాల్రెడ్డి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సత్యవాణి, జూనియర్ సివిల్ జడ్జిలు పద్మ, శోభారాణి, కేశవ, పద్మశ్రీ, అరుణశ్రీ, న్యాయవాదులు పాల్గొన్నారు.