మద్యం మత్తులో స్నేహితునిపై కత్తితో దాడి | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో స్నేహితునిపై కత్తితో దాడి

Published Fri, Sep 30 2016 1:33 AM

nife attack on friend

అన్నవరప్పాడు(పెరవలి) : మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితునిపైనే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెరవలి మండలం అన్నవరప్పాడు సెంటర్లోని ఓ మద్యం దుకాణం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పిట్టలవేమవరానికి చెందిన ఒరిగేటి కనకయ్య, బొద్దా వెంకట్రావు, సరెళ్ల సాయిబాబు స్నేహితులు. వీరంతా కూలీలు. సాయిబాబు కొబ్బరిచెట్లు నరికే పనిని ఒప్పుకుని ముగ్గురం గురువారం వెళ్దామని స్నేహితులకు సూచించాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒరిగేటి కనకయ్య, బొద్దా వెంకట్రావు పెరవలి మండలం అన్నవరప్పాడు సెంటర్‌లోని మద్యం దుకాణంలో మద్యం సేవిస్తుండగా, అక్కడకు సాయిబాబు వచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతను మిమ్మల్ని నమ్మి పనికి ఒప్పుకుంటే రాకుండా మందు కొడుతున్నారా అంటూ కనకయ్యను దుర్భాషలాడాడు. దీంతో కనకయ్య కూడా దుర్భాషలాడాడు. వాదన పెరగడంతో ఒకరినొకరు గెంటుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సాయిబాబు నీ అంతు చూస్తాను అంటూ వెళ్లిపోయి కత్తితో తిరిగి వచ్చాడు. కనకయ్యపై దాడిచేశాడు. కనకయ్య మెడపై తీవ్ర గాయమైంది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పెరవలి ఎస్సై పి.నాగరాజు ఘటనాస్థలానికి వచ్చి కనకయ్యను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. సాయిబాబాను పోలీసులు అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement