ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు
ఒంగోలుటౌన్: ఎన్ని రాజకీయ పార్టీలు మారినా నిరుపేదలు మాత్రం పక్కాగృహాలకు దూరంగా ఉన్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఒక్కరికి కూడా పక్కాగృహాన్ని మంజూరు చేయలేదని విమర్శించారు. స్థానిక మల్లయ్య లింగయ్య భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో ‘ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు పేదలకు ఎండమావేనా’ అంశంపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను గుడిసెలు లేని రాష్ట్రంగా తయారు చేస్తానన్న చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. భూముల పంపిణీ చేయబోనని బాబు బహిరంగా చెప్పడం చూస్తుంటే పేదలకు ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పేదలు దరిద్రులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.
ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్డీ మౌలాలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు పీ బాలకోటయ్య, గద్దల రవి, జీపీ రామారావు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, మెుహిద్దీన్బాషా, బాలకోటయ్య, గిరిజన సమాఖ్య కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజయ్య, నల్లూరి మురళి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సింగరకొండ, సహాయ కార్యదర్శి గులాం హుస్సేన్ పాల్గొన్నారు.