కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయి | Sakshi
Sakshi News home page

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయి

Published Tue, Aug 16 2016 11:27 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయి

కర్నూలు(టౌన్‌): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే కోట్ల సర్కిల్‌లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక కిసాన్‌ఘాట్‌లో కోట్ల 97వ జయంతి వేడుకలను పురస్కరించుకుని భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి పేద ప్రజల గుండెల్లో  చిరస్థాయిగా నిలిచారన్నారు. రైతుల కోసం ఎల్‌ఎల్‌సీ, కేసీ కెనాల్, గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మాణంలో విశేషంగా కషి చేశారని కొనియాడారు.  ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ మాట తప్పారన్నారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, మాజీ ఎమ్మెల్యే మదన్‌గోపాల్, మాజీ జెడ్పీ చైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి, పీసీసీ కార్యదర్శి సర్దార్‌ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement