వివరాలు వెల్లడించిన డిఎస్పీ రమణ
విజయనగరం టౌన్ : గాజులరేగ ప్రాంతానికి చెందిన గ్రంధి గౌతమి అనే యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన ఎస్కోటకు చెందిన కుసుమంచి విక్రమ్ అనే నిందితున్ని టూటౌన్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. కేసు నమోదైన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుని పట్టుకోవడం విశేషం. ఈమేరకు మంగళవారం డీఎస్పీ రమణ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ఎంబీఎ చదువుతున్న విక్రమ్ మరదలు వరసయ్యే గౌతమి వెంట పడుతూ వేధిస్తుండేవాడు. విక్రమ్కు భయపడి గౌతమి తల్లిదండ్రులు చదువుకు మాన్పించేశారన్నారు. పెళ్లి చేసుకుంటానని బంధువులని పంపితే కాదన్నందుకు ఈ అఘాయిత్యాయినికి పాల్పడినట్లు వివరించారు. ఎస్కోట నుంచి విజయనగరం వచ్చి కత్తి కొనుగోలు చేసి నేరుగా గౌతమి ఇంటికి వెళ్లి అందిన మేరకు ఆమె గొంతును కోసి పరారైయ్యాడు. రెండో పట్టణ సీఐ, ఎస్సైలు పకడ్భంది ప్రణాళికతో మంగళవారం బాబా మెట్ట వద్ద నిందితుని పట్టుకున్నారన్నారు. విక్రమ్పై హత్యాయత్నం, నిర్భయ చట్టం, ఐపీసీ 354 కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై ఎస్.రవి, తదితరులు పాల్గొన్నారు.