Sakshi News home page

ప్రాణం బలిగొన్న ఇసుక లారీ

Published Fri, Aug 5 2016 12:04 AM

one person died due sand lorry

మార్టేరు(పెనుమంట్ర) :  మార్టేరు పాత వంతెన వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదం జరిగిన తీరు స్థానికులను భయకంపితులను చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నెగ్గిపూడి గ్రామానికి చెందిన కారాడి దుర్గారావు (44) చేపలవ్యాపారి. పాక్షిక వికలాంగుడు. గురువారం  మార్టేరు గ్రామంలోని పాలకొల్లు  రోడ్డులో పాత వంతెన వద్ద  మోటారు సైకిల్‌పై అతను ఆగి ఉండగా,  వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన పది టైర్ల ఇసుక లారీ బలంగా ఢీకొంది. దుర్గారావు ఒక్కసారిగా లారీ చక్రాల కింద పడ్డాడు. లారీ అతని తలపై నుంచి వెళ్లిపోవడంతో తల భాగం ఛిద్రమైంది. శరీరం నుంచి వేరైంది. కూడలిలో ఉన్న జనం పరుగున వచ్చేసరికి లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలంలో మృతుని కుమారుడు వెంకటేశ్‌ చేసిన రోదనలు అందరినీ కలచివేశాయి.  అనంతరం మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెనుమంట్ర ఇన్‌చార్జి ఎస్‌ఐ కడలి సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పాతవంతెన కూడలిలోని బ్రాందీ షాపు వద్ద రద్దీ వల్లే అనేక ప్రమాదలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement