- ఏఎస్సై మోహన్రెడ్డికి బాధితుల సంఘం సవాల్
కరీంనగర్: వందల కుటుంబాలను రోడ్డుకీడ్చిన మోహన్రెడ్డి తనకు ఆత్మహత్యే శరణ్యమని మొసలికన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని, దమ్ముంటే ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని పలువురు బాధితులు సవాల్ విసిరారు. మోహన్రెడ్డి బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ముస్కు మహేందర్రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా చైర్మన్ మార్వాడీ సుదర్శన్, లోక్సత్తా ఉద్యమ సంస్థ ప్రతినిధి నారాయణ, తదితరులు మాట్లాడారు. సీఐడీ పరిధిలో జరుగుతున్న కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని హైదరాబాద్లో ధర్నాలు చేస్తున్నపుడు తనను బదనాం చేస్తున్నారని వెల్లడించిన ఆయన.. మళ్లీ అక్రమ ఫైనాన్స్ నడిపేందుకు బాధితుల ఇళ్ల చుట్టూ తిరిగి ఎందుకు బతిమిలాడుతున్నారో చెప్పాలన్నారు. 11 మంది బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయొద్దన్న సీఐడీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కట్టరాంపూర్ రోడ్డులో వివాదంలో ఉన్న భూమిని గతనెల జూలై30న తన బావమరిది శ్రీపాల్రెడ్డి పేరిట 8012, 8013 డాక్యుమెంట్లలో రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. సీఐడీ ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్రెడ్డికి న్యాయపోరాటం చేసే హక్కు లేదన్నారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక విచారణకు సిద్ధమంటూ బాధితులను ఎందుకు ప్రలోభపెడుతున్నారని ప్రశ్నించారు. మానసిక క్షోభకు గురువుతున్నానంటున్న ఆయనకు ఆ పదానికి అర్థమే తెలియదని విమర్శించారు. ప్రసాద్రావు, నారాయణరెడ్డి, రాంచంద్రంతో పాటు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేందుకు ఆయనే కారకుడన్నారు.