ఏలూరు(సెంట్రల్): అభివృద్ధి పేరిట మరో విధ్వంసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయని, ఈ విషయంలో ఉభయగోదావరి జిల్లాల ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉంటూ ఐక్యంగా షేల్ గ్యాస్ వెలికితీత కార్యక్రమాన్ని అడ్డుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. పచ్చని పొలాలతో కళకళలాడే ఉభయగోదావరి జిల్లాను కాలుష్యకాసారంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయన్నారు. కృష్ణగోదావరి బేసిన్లో షేల్ గ్యాస్ వెలికితీతకు తొలుత ఒఎన్జిసీ పేరుతో ఆ తర్వాత కార్పొరేట్ సంస్థలకు అప్పగించి బావులు తవ్వేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారని, చట్టాలను ఉల్లంఘించి బాధిత గ్రామాలను వదిలి భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ఏమిటని బలరాం ప్రశ్నించారు. అనేక అనర్థాలకు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యే షేల్ గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బాధిత గ్రామాల ప్రజలకు అండగా ఉండి అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు, ప్రజల సహయంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకుంటామని ఆయణ హెచ్చరించారు.