ఆర్డర్‌ టు సర్వ్‌ | Sakshi
Sakshi News home page

ఆర్డర్‌ టు సర్వ్‌

Published Fri, Sep 2 2016 12:09 AM

ఆర్డర్‌ టు సర్వ్‌ - Sakshi

  • ప్రస్తుతం ఈ ప్రకారమే ఉద్యోగుల కేటాయింపు
  • శాశ్వత కేటాయింపులకు సంవత్సరం పట్టే అవకాశం
  • జూన్‌ నాటికి పూర్తి చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు
  • ప్రస్తుతం మూడు జిల్లాలపైనే దృష్టి
  • హన్మకొండ అర్బన్‌: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. కార్యాలయాల గుర్తింపు.. సౌకర్యాలు.. ఫైళ్ల పంపిణీపై కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో తలమునకలైన ఉద్యోగుల్లో.. తమ భవితవ్యం ఏమిటనే ఆందోళన కూడా ఉంది. ఇప్పటివరకు కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళిక అంశాలపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం ఉద్యోగుల విభజనలో వేగంగా ముందుకు వెళ్లడం లేదు. ఉద్యోగుల బదిలీలకు, కేటాయింపులకు ప్రామాణికం ఏమిటనే విషయంపై స్పష్టత లేదు. దీంతో విభజన సమయంలో సహజ న్యాయ సూత్రం అన్నట్లు ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ నిబంధనల మేరకు ఉద్యోగుల  కేటాయింపులు ఉంటాయని, ఆ మేరకు పనిచేయాల్సి ఉంటుదని ఉద్యోగులు మానసికంగా సిద్ధమవుతున్నారు. 
     
     ఆర్టర్‌ టు సర్వ్‌ అంటే...
    తాత్కాలిక కేటాయింపుల ఉత్తర్వులను ఆర్డర్‌ టు సర్వ్‌ అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సమయంలో ఈ ఉత్తర్వుల మేరకే ఇరు రాష్ట్రాల్లో ఉద్యోగుల పంపకం చేశారు. అనంతరం కమలనాథన్‌ కమిటీ పూర్తి స్థాయి కేటాయింపులు నిబంధనల ప్రకారం జరిగే విధంగా చూస్తోంది. ఇప్పుడు జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా ఇదే విధమైన ఉత్తర్వులతో ఉద్యోగులు వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలకు కేటాయించబడతారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. కొత్త చోటుకు వెళ్లే ఉద్యోగులు అభ్యంతరాలువ్యక్తం చేయరాదు. ఎందుకంటే.. ఇవి తాత్కాలిక కేటాయింపులే కాబట్టి ఎక్కడికి బదిలీ చేసినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.
     
    కమిటీ ద్వారానే కేటాయింపుల నింబంధనలు
    జిల్లాల విభజనకు సంబంధించి ప్రస్తుతం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీనే ఉద్యోగుల కేటాయింపులు చూస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లు మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారితో కమిటీ ఏర్పాటు చేసినా కేటాయింపుల విషయంలో ఉద్యోగుల స్థానికత, ఆప్షన్స్, సీనియార్టీ తదితర విషయాలు పరిశీలిస్తారు. వాటి మేరకు కేటాయింపులు ఉంటాయి. అయితే ఇది పూర్తి కావడానికి ఎంత వేగంగా చేసినా కనీసం సంవత్సరకాలం పట్టవచ్చని సీనియర్‌ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు ద్వారా.. ఉద్యోగులను వారి స్వస్థలం ఆధారంగా(610జీవో) ఆయా జిల్లాలకు కేటాయిస్తారు. ఈ సమయంలో ఉద్యోగులు తమ కేటయింపుల విషయంలో అభ్యంతరాలు ఉన్నట్లయితే వ్యక్తం చేయవచ్చు. ఈ విధంగా కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు కేటాయించబడిన ఉద్యోగులు ఒక వేళ ఇతర జిల్లాలకు మారాలంటే జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో శాఖ పరంగా డిప్యూటేషన్‌ ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. ఈ అవకాశం   శాశ్వత కేటాయింపులు పూర్తయిన తరువాతే ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కేటాయించిన చోట విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
     
     శాఖల విలీనం..
    ప్రస్తుతం జిల్లాల ఏర్పాటు సమయంలో కొన్ని శాఖలు కలిపి ఉమ్మడిగా చేయాలని ఆలోచనలు ఉన్నా ఈ విషయంలో చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. సీనియార్టీ, హోదా విషయాల్లో చిక్కులు తప్పక పోవచ్చు. అయితే శాఖల విలీనం కాకుండా మధ్యేమార్గంగా శాఖలు వేరైనప్పటికీ ఒకే ఉన్నతాధికారి కింద పనిచేసేవిధంగా తాత్కాలిక ఏర్పాట్లు చేయవ్చని చర్చ జరుగుతోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగుల కొరత కూడా కొంతవరకు తగ్గుతుంది. ప్రభుత్వ అంతిమ నిర్ణయం మేరకు ఈ విషయంలో కేటాయింపులు ఉంటాయి.
     
     జోనల్‌ వ్యస్థ పక్కకు..
    ప్రస్తుతం జోనల్‌ వ్యవస్థ జోలికి ప్రభుత్వం వెళ్లే పరిస్థితి లేదు. దీంతో జోనల్‌ స్థాయి అధికారులను కూడా జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేసే అవకాశాలుఉన్నాయి. జేడీ, డీడీ, ఏడీ స్థాయి అధికారులు ఒక శాఖలో ఉన్నట్లయితే వారిని జిల్లాకు ఒకరిని కేటాయిస్తారు. మిగతా ఉద్యోగులది కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. జోనల్‌ వ్యవస్థపై స్పష్టత వచ్చాక జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్‌ నిర్ణయిస్తే అప్పుడు సర్వీస్‌ రూల్స్‌ మార్పులు చేసి తదుపరి బదిలీలు, పదోన్నతులు కొనసాగించే అవకాశం ఉంటుంది.
     
     జిల్లాలో 40,243 పోస్టులు
    జిల్లాలో మొత్తం వివిధ స్థాయిలో ఉద్యోగుల పోస్టులు మొత్తం 40,243 ఉన్నాయి. వీటిలో గెజిటెడ్‌ హోదా పోస్టులు 3502, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల పోస్టులు 31,139, క్లాస్‌ ఫోర్త్‌ ఉద్యోగులవి 547, మిగతావి ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులవి, పార్ట్‌టైం, కాంట్రాక్ట్‌వారివి. అయితో ప్రసుతం వివిధ స్థాయిల్లో ఖాళీలుపోను సుమారు 3644 మంది గెజటెడ్, నాన్‌గెజిటెడ్, క్లాస్‌ ఫోర్త్‌ హోదాలో పనిచేస్తున్నారు. వీరు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు కేటాయింపుల వారీగా వెళ్లాల్సి ఉంటుంది.
     
    జూన్‌లోపు ఉద్యోగుల కేటయింపులు పూర్తి చేయాలి
    ఎన్నమనేని జగన్మోహన్‌రావు, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
    ప్రభుత్వం ఉద్యోగుల శాశ్వత కేటయింపుల కోసం సత్వరం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారితో కమిటీ ఏర్పాటు చేసి వేగంగా పనులు చేపట్టాలి. జూన్‌ ఆఖరు నాటికి కేటయింపులు పూర్తిచేసి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి. తద్వారా పిల్లల చదువులు ఇబ్బందులు కాకుండా ఉంటాయి. ఆలస్యం అవుతున్నాకొద్దీ ఉద్యోగుల్లో ఆందోళననెలకొంటుంది. ఇదే విషయం కమిటీకి వివరిస్తాం. విభజన పేరుతో ఉద్యోగులు నష్టపోవడాన్ని ఉద్యోగ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించవు.
     
     సీనియార్టీ, స్థానికత, ఆప్షన్స్‌ ప్రకారం కేటాయింపులు ఉండాలి
     రాజ్‌కుమార్, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు
    ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉద్యోగుల స్థానికత, సీనియార్టీ వివరాలు ఉన్నాయి. ఆప్షన్స్‌కూడా తీసుకుంటున్నారు. అందువల్ల ఉద్యోగులను సీనియార్టీ, స్థానికత, ఆప్షన్స్‌ ఆధారంగా కేటాయింపులు చేపడితో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కొద్దిపాటి మార్పులు ఉన్నా క్రమంగా సర్దుబాటు చేసుకోవచ్చు. లేదంటే ఈ ప్రకియ చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాల్లో ఉద్యోగులపై పనిభారం ఎక్కువ ఉండకుండా స్టాప్‌ ప్యాట్రన్‌ ఏర్పాటుచేయాలి.

Advertisement
Advertisement