- ముగిసిన ధూనీవాలే బాబా తపస్సు
- పూర్ణాహుతి రోజున జోరుగా వర్షం
శ్రీశైలం: చుట్టూ పిడకలు, కట్టెలు పేర్చి వాటిని నిప్పంటిచి..మధ్యలో లింగాకృతిలో ఉన్న కేంద్రంలో తపస్సు చేస్తున్న ఈ సాధువు పేరు మోహన్దాస్ త్యాగి (ధూనీవాలే బాబ). హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లా భేడుకి గ్రామానికి చెందిన ఈయన 11 రోజులుగా శ్రీశైలంలోని శివదీక్షా శిబిరాలు – షాపింగ్ కాంప్లెక్స్ మధ్య పంచాగ్ని సాధన దీక్ష చేపట్టి బుధవారం ముగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక వైపు భానుడి ఎండ, మరోవైపు మండే కట్టలు, పిడకల మధ్య కఠోర ఉపవాస దీక్షతో పంచాక్షరి నామాన్ని జపిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు తపమాచరించానన్నారు. కాళ్లను బంధించుకుని వేలాడే ఒక కర్రపై నుంచి తలకిందులుగా వేలాడుతూ సాధన చేసినట్లు చెప్పారు. ఇలా చేయడం వల్ల పంచభూతాలైన పృథ్వి, ఆకాశం, వాయువు, అగ్ని, జలంతో పాటు సూర్యభగవానుడి ప్రతాపానికి తోడుగా చుట్టూ పేర్చబడిన కట్టెలు, పిడకల వేడితో పాటు తనలో ఉన్న వేడి ద్విగుణీకృతమై ఆకాశం చేరి వర్షం కురుస్తుందని అన్నారు.
గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, నోయిడా, గజియాబాద్ మొదలైన ప్రాంతాలలో పంచాగ్ని సాధనతో వర్షాలు కురిశాయన్నారు. ఈ ఏడాది శ్రీశైల మహాక్షేత్రంలో ఈ క్రతువును నిర్వహించమని దైవాజ్ఞ వచ్చిందన్నారు. ఉగాది ఉత్సవాలకు ముందే శ్రీశైలం చేరుకుని దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణభరత్ గుప్తను కలిసి అనుమతి తీసుకున్నానని చెప్పారు. ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందించడంతో నిర్విఘ్నంగా 11 రోజుల పాటు ఈ సాధన చేసినట్లు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే.. పూర్ణాహుతి ముగిసిన వెంటనే శ్రీశైలంలో కుండపోత వర్షం కురవడంతో స్థానికులు, భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. శ్రీశైలం నుంచి గుజరాత్కు వెళ్తున్నానని, అక్కడ ఈ క్రతువును ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెప్పారు.