Sakshi News home page

'పెట్టె' ఫలితమివ్వలే!

Published Wed, Feb 21 2018 9:07 AM

people not respond on complaint box - Sakshi

గ్రామాల్లో జరిగే కొన్ని నేరాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కొందరు జంకుతారు. పోలీసులు ఎక్కడ తమ పేరు బయట పెడుతారోనన్న భయంతో చాలావరకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదు. వీరికోసమే పోలీసులు వినూత్న రీతిలో ప్రతి పంచాయతీ వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. అయినా పెద్దగా స్పందన లేకపోవడంతో పోలీసులు చేపట్టిన ప్రయత్నంవిఫలమవుతోంది.

అడ్డాకుల (దేవరకద్ర): మహబూబ్‌నగర్‌ జిల్లాలో అడ్డాకుల మండలాన్ని పోలీసుశాఖ మోడల్‌ మండలంగా ఎంపిక చేసింది. ఫిర్యాదుల పెట్టె పేరుతో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2017 జనవరి 5న కందూర్‌లో ఫిర్యాదుల పెట్టెపెట్టెను మహబూబ్‌నగర్‌ డీఎస్పీ భాస్కర్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పోలీసు అధికారి కార్యాలయం బయట ఓ ఫిర్యాదుల పెట్టెను అమర్చారు. 

ఫిర్యాదు రాసి పెట్టెలో వేస్తే..
పోలీసు శాఖకు సంబం«ధించిన ఏదైనా సమస్యను ఓ తెల్లకాగితంపై రాసి ఫిర్యాదుల పెట్టెలో వేయాలి. రాసేవారు తమ పేరును రాయాల్సిన పనిలేదు. అయితే ప్రతి సోమ, గురువారాల్లో నిర్వహించే గ్రామ పోలీసు కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చే పోలీసు అధికారి డబ్బాలో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. అడ్డాకుల మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ఫలితమిస్తే జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భావించారు. 

ఎలాంటి స్పందనా రాలే!
 ప్రతి గ్రామ పం చాయతీ కార్యాలయం వద్ద ప్రత్యే కంగా ఫి ర్యాదు పెట్టెను ఏర్పాటు చేశారు. వాటి వినియోగంపై ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేశారు. ప్ర తి సోమ, గురువారాల్లో పోలీసు అధికారులు తమ కార్యాలయాలకు వచ్చినప్పుడు ఫిర్యాదుల పెట్టె తాళం తీసి అందులో ఉన్న సమస్యల తెలుసుకుం టారు. దాన్ని పరిష్కరించేందుకు చర్యతీసుకుంటారు. ఈవ్‌ టీజింగ్, పేకాట, ఇసుక అక్రమ రవాణా, మత్తు మం దుల విక్రయాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చని ప్రచారం చేశారు. అయినా ప్రజలనుంచి ఎలాంటి స్పందన లేదని చెబుతున్నారు. చిన్న తగాదాలను పోలీసు అధికారుల దృష్టికి తేవాలని సూచించినా పెద్దగా స్పందన రాలేదు. 

ప్రజలు ముందుకు రావాలి
ఫిర్యాదుల పెట్టె ప్రయోగాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టినా ప్రజల నుంచి స్పందన రావడంలేదు. గ్రామాల్లో జరిగే నేరపూరిత చర్యలపై పోలీసులకు సమాచారం ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నా ప్రజలు ఫిర్యాదుల పెట్టెను వినియోగించుకోలేదు. మరోసారి దీన్ని చేపట్టే అంశం ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంది.  – ఎం.బాలస్వామి, ఏఎస్‌ఐ అడ్డాకుల

Advertisement

తప్పక చదవండి

Advertisement