ఎమ్మెల్యే మాధవనాయుడిని నిలదీసిన మత్స్యకారులు | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మాధవనాయుడిని నిలదీసిన మత్స్యకారులు

Published Sun, Nov 13 2016 6:48 PM

ఎమ్మెల్యే మాధవనాయుడిని  నిలదీసిన మత్స్యకారులు - Sakshi

-మీరు, బాబే మాపొట్టకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు
–గతంలో పరిశ్రమ ఆపుతామని హామీలిచ్చారు. 
 
మొగల్తూరు:
చంద్రబాబు నాయుడు, నీవు కలిసి మాపొట్టలు కొట్టేందుకు ప్రయత్రిస్తున్నారంటూ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పై చింతరేవు వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఆదివారం ముత్యాలపల్లి, కొత్తోట గ్రామాల్లో పర్యటించారు. ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు రామాలయం వద్దకు ఎమ్మేల్యే చేరుకోగానే గ్రామంలోని మహిళలు తుందుర్రు ఆక్వా పరిశ్రమ పనులు నిలిపివేయాలంటూ ఎమ్మెల్యే ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా గ్రామంలోని  మహిళలు మాట్లాడుతూ కొత్తోటలో జరిగిన బహిరంగ సభలో ఆక్వా పరిశ్రమ పనులు నిలిపివేసేందుకు కృషి చేస్తున్నానని ప్రకటించి తిరిగి పరిశ్రమ ఏర్పాటుకు మద్దతు పలకడం భావ్యంగా ఉందాంటూ ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాలుగా ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాపొట్టకొట్టే ఆక్వా పరిశ్రమ మాకొద్దు, జీవనదిలాంటి గొంతేరును కలుషిత చేయవద్దని, పరిశ్రమను మూసివేసేలా హమీలివ్వాలంటూ నిలదీసారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడానని తుందుర్రు ఆక్వా పరిశ్రమ ద్వారా కలుషిత నీరు గొంతేరు డ్రెయన్‌లో కలవుకుండా పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చారన్నారు. యనమదుర్రు డ్రెయన్‌ ప్రక్షాలనకు త్వరలో నిదులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. ఈవిషయంపై మరోసారి మహిళలు మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ కోరుతుంటే   పైప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తామంటూన్నారేంటంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే మాధవనాయుడు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే వెనుదిరిగారు. దీంతో తిరుమాని లక్ష్మి, వాటాల ధనలక్ష్మి, బర్రి లక్ష్మి, వాటాల సోమాలమ్మ, గాడి మాణిక్యం తదితరులు ప్రభుత్వానికి, పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
మత్య్సకార నాయుకుడుని అడ్డుకున్న గ్రామస్తులు
 
గొంతేరు డ్రెయన్‌ కలుషితం కాకుండా పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అందుకు సహకరించాలని మత్య్సకార నాయకుడు ఆండ్రాజు చల్లారావు  మాట్లాడారు. దీనిపై గ్రామస్తులు నీవు మత్య్సకార సామాజిక వర్గానికి చెందిన వాడివై ఉండి జీవ నదిలాంటి గొంతేరు కలుషితం బారిన పడి, తాము జీవనోపాది కొల్పోతుంటే ప్రభుత్వాని మద్దతుగా మాట్లాడటమేమిటని వాగ్వివాదానికి దిగారు. రెండు సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తుంటే ఎప్పుడూ గ్రామంలోకి వచ్చి మాట్లాడని వాడివి ఇప్పుడు వచ్చి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు. గ్రామపెద్దలు కల్పించుకుని చల్లారావును, స్థానికలను పంపిచివేశారు.
 

Advertisement
Advertisement