త్రివిధ దళాలకు దీటుగా పోలీసుల సేవలు | Sakshi
Sakshi News home page

త్రివిధ దళాలకు దీటుగా పోలీసుల సేవలు

Published Mon, Oct 17 2016 10:08 PM

police services

  • జిల్లాలో ఇప్పటి వరకూ అమరులైన 60 మంది
  • ఎస్పీ రవిప్రకాష్‌
  • కాకినాడ క్రైం: 
    దేశ భద్రతలో త్రివిధ దళాలు అందిస్తున్న సేవలకు దీటుగా శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు అవిశ్రాంతంగా పాటుపడుతున్నారని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్గత  శాంతి భద్రతల విషయంలో పోలీసుల సేవలు మరువలేనివన్నారు. పోలీసుశాఖ పట్ల అవగాహన కల్పించేందుకు భావిపౌరులైన విద్యార్థులకు జిల్లావ్యాప్తంగా వక్తృత్వ, పెయింటింగ్‌ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్‌ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ఏజెన్సీలో నక్సలైట్ల కార్యకలాపాలను, అక్రమ మైనింగ్‌ను అరికట్టే కృషిలో ఇప్పటి వరకూ 60 మంది పోలీసులు మరణించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది కాలంలో విధినిర్వహణలో 700 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో శాంతి భద్రతల విషయంలో పోలీసులు అందిస్తున్న సేవలు మరువలేనివమన్నారు. నిత్యం విధి నిర్వహణలో తీరిక లేకపోయినా సామాజిక సేవా కార్యక్రమాల్లో పోలీసులు చురుగ్గా పాల్గొనడాన్ని అభినందించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసులు కీర్తి, శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్స్, పలు కళాశాలలకు చెందిన 200 మంది నుంచి రెడ్‌క్రాస్‌ సంస్థ ద్వారా రక్త సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దామోదర్, రెడ్‌క్రాస్‌ సంస్థ చైర్మన్‌ వైడీ రామారావు, కార్యదర్శి డాక్టర్‌ దుర్గరాజు, ఎస్సీ, ఎస్టీసెల్‌ డీఎస్పీ ఎస్‌.మురళీమోహన్, ఏఆర్‌ డీఎస్పీ వాసన్, ఆర్‌ఐ ఏఆర్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ ఎఎన్‌ఎస్‌ రాజ్‌కుమార్, సీఐలు వి.పవన్‌కిషోర్, పి.మురళీకృష్ణ పాల్గొన్నారు. 
     

Advertisement

తప్పక చదవండి

Advertisement