రైతు బాగోగులు పట్టవా? | Sakshi
Sakshi News home page

రైతు బాగోగులు పట్టవా?

Published Sun, Nov 20 2016 1:28 AM

రైతు బాగోగులు పట్టవా? - Sakshi

►  కొనుగోలు బాధ్యతలనుంచి తప్పించుకుంటున్న జేసీఐ
► సగం కొనుగోలు కేంద్రాలు ఇతర సంస్థలకు
► అందుబాటులో ఉంచని జేసీఐ కేంద్రాలు
►  గిట్టుబాటు ధర రానీయకుండా చేసేందుకేనని రైతుల మండిపాటు
► మద్దతు దర కావాలంటే 60 కిలోమీటర్లు వెళ్లాల్సిందే!
 
అసలే జిల్లాలో గోగునార ఉత్పత్తి అంతంత మాత్రంగా ఉంటోంది. నానా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడమే దీనికి కారణం. ఇవేమీ పట్టించుకోని జూట్‌కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాల సంఖ్యను తగ్గించేసి... కొన్నింటిని ప్రైవేటుకు అప్పగిస్తోంది. రైతులకు మద్దతు ధర చెల్లించకుండా తప్పుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని రైతులు వాపోతున్నారు. జేసీఐ కేంద్రాలకే విక్రరుుంచి... మద్దతు ధర పొందాలంటే కచ్చితంగా సుదూరంప్రయాణించాల్సిందే.

విజయనగరం కంటోన్మెంట్: గోగు రైతుకు ప్రభుత్వం మద్దతు ధర అందనివ్వకుండా చేస్తోంది. ప్రైవేటు వర్తకులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నదని రైతులు వాపోతున్నారు. గోగు అధికంగా పండించే చోట జేసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా దూరంగా ఏర్పాటు చేస్తున్నారు. అంత దూరం నారను తీసుకెళ్ల లేక, తప్పనిసరి పరిస్థితుల్లో రైతాంగం దళారులకు అప్పగిస్తోంది. జేసీఐ సంస్థ  పూర్తి స్థారుులో గోగునార కొనుగోలు చేయలేక ఇప్పుడు మరో సంస్థకు కొనుగోలు బాధ్యత అప్పగించింది. ఇందులో భాగంగా క్వింటాలుకు రూ.30 కమీషన్ పద్ధతిన నేకాఫ్ సంస్థకు రెండు జిల్లాల్లో సగం కేంద్రాలను అప్పగించింది. వీరి ఆధ్వర్యంలో శనివారం నుంచి గోగు నార కొనుగోళ్లను నేకాఫ్ అధికారులు ప్రారంభించనున్నారు.

విస్తీర్ణం తగ్గడానికి కారణం సర్కారే...
ఒకప్పుడు జిల్లాలో 65వేల హెక్టార్లలో గోగు సాగయ్యేది. సర్కారు ఇచ్చే మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడంతో క్రమేపీ విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఇటీవలే మళ్లీ సాగు విస్తీర్ణం పెంచుకుంటున్న తరుణంలో మళ్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఈ పంట మళ్లీ తగ్గవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారికి మద్దతు ధర అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటుచేసి గోగునార కొనుగోలు చేయాల్సిన జేసీఐ(జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) కొనుగోలును కూడా కమీషన్ పద్ధతిపై మరో సంస్థకు అప్పగించింది.

జిల్లాలో ఉన్న పలు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిన జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రెండు జిల్లాల్లో కలిపి ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అందులో సగం కమీషన్ పద్ధతిపై నేకాఫ్‌కు(జాతీయ వ్యవసాయ దారుల ఉత్పత్తుల కొనుగోలు, ప్రొసెసింగ్, రిటైలింగ్ సహకార సంఘాల సమాఖ్య)అప్పగించింది. జిల్లాలో గజపతినగరం, చీపురుపల్లి, డొంకినవలస, పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట కేంద్రాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు, రాజాం కేంద్రాలను ఈ ఏడాది ప్రారంభించనున్నారు. ఇందులో నేకాఫ్‌కు పొందూరు, గజపతినగరం, చీపురుపల్లి, డొంకినవలస కేంద్రాలను అప్పగించారు. మిగతా కేంద్రాలు జేసీఐ నిర్వహించనుంది.

మద్దతు ధర కావాలంటే 60 కిలోమీటర్ల ప్రయాణం
జిల్లాలోని డొంకినవలస తదితర కొనుగోలు కేంద్రాల్లో ప్రెస్‌లు లేవని(జూట్‌ను బేళ్లుగా కట్టే యంత్రాలు) దూరంగా ఉన్న గజపతినగరం వంటి కొనుగోలు కేంద్రాల వద్దకు జూట్‌ను తీసుకురావాలని నేకాఫ్ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని డొంకినవలస కొనుగోలు కేంద్రానికి బొబ్బిలి సమీపంలోని గ్రామాలు, తెర్లాం మండల గ్రామాల రైతులు నారను విక్రరుుంచేందుకు తీసుకువచ్చేవారు. ఇప్పుడు గజపతినగరం తీసుకువెళ్లాలంటే బోలెడంత వ్యయం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏంచేస్తున్నట్టు?
బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ డొంకినవలస కొనుగోలు కేంద్రానికి ప్రెస్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మా నుంచి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేసిన(సెస్సులు) మార్కెట్ కమిటీ తమకు ఆ మాత్రం న్యాయం చేయలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. పాల్తేరు, వాడాడ, తె ర్లాం మండలంలోని సుదూర ప్రాంతాలనుంచి వచ్చే రైతులు గజపతినగరం ఎలా తీసుకెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.

సిబ్బంది లేకే
జిల్లాలో జేసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గోగు కొనేందుకు సిబ్బంది లేరు. పలువురు రిటైర్డ్ అవుతున్నా కొత్తగా నియామకాలు జరగడం లేదు. నేకాఫ్ సిబ్బందితో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుని గోగు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది లక్ష క్వింటాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం ఇప్పటికే కొనుగోలు ప్రారంభించాం. నేకాఫ్ శనివారం నుంచి కొనుగోలు చేపడుతుంది.  - జి.రమణ కుమార్, రీజనల్ మేనేజర్, జేసీఐ, విజయనగరం
 
మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను అడిగాం..
బొబ్బిలి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను జ్యూట్ ప్రెస్‌ను అమర్చాలని కోరాం. ఆయన మరమ్మతులు చేరుుస్తామన్నారు. ఈ లోగా మేం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నాం. అందుకే అప్పటి వరకూ కొనుగోలు కేంద్రాన్ని గజపతినగరంలో ఏర్పాటు చేశాం. అక్కడికే రావాలని రైతులను కోరుతున్నాం.  - పి.వి.ఎస్.ఎల్.ఎన్.శాస్త్రి, నేకాఫ్ మేనేజర్

Advertisement
Advertisement