పరారీలోనే ప్రధాన సూత్రదారి | Sakshi
Sakshi News home page

పరారీలోనే ప్రధాన సూత్రదారి

Published Wed, Aug 24 2016 11:08 PM

పరారీలోనే ప్రధాన సూత్రదారి - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రియాజ్‌ భత్కల్‌... గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ పేలుళ్లకు సూత్రధారిగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతడి పేరు ప్రముఖంగా ఉంది. ఉగ్రవాదం ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సైతం చేశాడు.  ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) గుట్టు బయటపడటం వెనుకా ఇతని ‘పాత్ర’ ఉంది. 2007 ఆగస్టు 25 నాటి ఆ జంట పేలుళ్లకు తొమ్మిదేళ్లు పూరై్తన నేపథ్యంలో ఇప్పటికీ పరారీలోనే ఉన్న ఈ గజ ఉగ్రవాది నేపథ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

ముంబైలో మొదలైన ‘ప్రస్థానం’...
రియాజ్‌ భత్కల్‌ అసలు పేరు రియాజ్‌ అహ్మద్‌ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్‌ వ్యవహారాలు ఎక్కువ. ఆ ప్రభావంతోనే రియాజ్‌ భత్కల్‌ నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు ముంబైలో నివసించింది. మొదటి నుంచి డబ్బుపై యావ ఎక్కువ ఉన్న ఇతగాడు ఈ నేపథ్యంలోనే ముంబై గ్యాంగ్‌స్టర్‌ ఫజల్‌–ఉర్‌–రెహ్మాన్‌ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు వంటివి చేసి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ మేరకు ఇతనిపై కోల్‌కత, ముంబై, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా...

ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగ్‌ నుంచి బయటకు వచ్చి కుర్లా ప్రాంతంలో ‘ఆర్‌ఎన్‌’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రార్థనా స్థలంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు తరచూ వెళ్లేవాడు. ఆ ప్రోద్భలంతో నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)లో పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్‌ భత్కల్‌ పాక్‌ ప్రేరేపిత లష్కరేతొయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్‌ ఇన్‌చార్‌్జగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్‌ రజా కమెండో ఫోర్స్‌ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్‌ రజా ఖాన్‌ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు సమకూరుస్తుంటాడు.

ధనార్జన కోసం రియల్టర్‌ అవతారం...
జిహాద్‌ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్‌ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారి మళ్లించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. మరిన్ని నిధుల కోసం పూణేకు చెందిన వ్యాపారుల కిడ్నాప్‌కు కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాలు కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా రూపంలో భారీగా నిధులు సమీకరించాడు.

అయితే వాటిని తన సొంత ‘ఖాతా’ల్లోకి మార్చుకుంటూ మంగుళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్‌ పరిసరాల్లో భారీగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్‌ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. భత్కల్‌ ఇండియన్‌ ముజాహిదీన్‌లో సెకండ్‌ కమాండ్‌ ఇన్‌చార్జ్‌ హోదాలో ఉండటంతో నిధులుపై అజమాయిషీ ఇతనిదే. దీంతో జమాఖర్చులు అడిగే సాహసం మాడ్యూల్‌లోని ఎవరూ చేయలేకపోయారు.

‘ఐఎం’ గుట్టు బయటపడింది ఇతని వల్లే...
ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్‌ భత్కల్‌ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్‌ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. దీనిని మరో ఉగ్రవాది సాదిక్‌ షేక్‌ వ్యతిరేకించాడు. ఇలా చేయడం వల్ల తమ ఉనికి బయటపడి, దర్యాప్తు అధికారులకు పట్టుబడే అవకాశం ఉందని వాదిస్తూ వచ్చాడు. ఈ మాటలను రియాజ్‌ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు.

తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు  భారీగా వస్తాయని సాదిక్‌తో వాదించాడు. తన పంతం నెగ్గించుకొని ప్రతీ విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్‌ పంపేవాడు.  ఈ మెయిల్స్‌ వచ్చిన ఐపీ అడ్రస్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురటై్టంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన రియాజ్‌.. ప్రస్తుతం పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్నాడు.

జంట పేలుళ్లులో ఇదీ పాత్ర....
మహారాష్ట్రలోని పూణేకు చెందిన మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌చౌదరి, అనీఖ్‌ షపీఖ్‌ సయ్యద్‌లు మాస్టర్‌మైండ్‌ రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల మేరకు 2007 జూలైలో హైదరాబాద్‌ వచ్చారు. అదే ఏడాది జూలై, ఆగస్టుల్లో రియాజ్‌ అనేకసార్లు నగరానికి వచ్చి వెళ్లాడు. అక్బర్, అనీఖ్‌లు తమ ‘టార్గెట్‌’ను ఎంచుకొని ముంబైలో ఉన్న రియాజ్‌ భత్కల్‌కు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు ముంబైలో జరిగిన సమావేశంలో ఇండియన్‌ ముజాహిదీన్‌ మాస్టర్‌మైండ్ గా భావించే రియాజ్‌ భత్కల్, సాదిక్‌ షేక్‌లతో పాటు అన్సార్‌ అహ్మద్‌ బాద్‌షా షేక్‌ కూడా పాల్గొన్నాడు.

ప్రణాళిక మొత్తం సిద్ధమయ్యాక ఆగస్టు 23న భత్కల్‌ నగరానికి వచ్చాడు.  అప్పటికే పార్సిల్‌లో పంపిన బాంబులను అసెంబుల్‌ చేశాడు. చివరకు ఆగస్టు 25న రియాజ్‌ భత్కల్‌ గోకుల్‌ఛాట్‌లో, అనీఖ్‌ షఫీఖ్‌ సయ్యద్‌ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా... మూడోది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement