ఎర్రచందనం డంప్‌ స్వాధీనం | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం డంప్‌ స్వాధీనం

Published Fri, Jul 22 2016 12:38 AM

ఎర్రచందనం డంప్‌ స్వాధీనం - Sakshi

రుద్రవరం: రుద్రవరం అటవీ ప్రాంతంలోని తెలుగుగంగ ప్రధాన కాల్వ పైభాగాన అక్రమ రవాణాకు సిద్ధం చేసిన  63 ఎర్రచందనం దుంగలు.. తొమ్మిది సైకిళ్లను గురువారం రాత్రి రుద్రవరం ఎస్‌ఐ హనుమంతయ్య స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.కోటికి పైమాటేనని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అజ్ఞాత వ్యక్తుల సమాచారం మేరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎస్‌ఐతో పాటు సిబ్బంది గురువారం అడవిలో విస్తత తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రచందనం డంప్‌తో పాటు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగల సరఫరా వెనుక బలమైన ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో స్మగ్లర్లు ఆహారం తయారీకి వినియోగించిన వంట పాత్రలు, కూరగాయాలు, బియ్యం పప్పుదిసుసులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు దుంగల తూకానికి వినియోగించే వేయింగ్‌ మిషన్‌ కూడా ఉన్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో వర్షాల కారణంగా వాహనాలు దుంగలను నిల్వ చేసిన ప్రదేశానికి వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా 10 నుంచి 15 రోజులుగా డంప్‌ను అక్కడే ఉంచినట్లుగా భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను సైకిళ్ల సహాయంతో దిగుమతి చేసుకొని రుద్రవరం అటవీ ప్రాంతంలోని ఉల్లెడ మల్లేశ్వర స్వామి ఆలయం మీదుగా ఎంపిక చేసిన ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. దాడుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ భూపాల్‌ రెడ్డి, పోలీసులు శాంతిరెడ్డి, మస్తాన్, రమేష్‌ పాల్గొన్నారు. ఇదిలాఉండగా ఎస్‌ఐ హనుమంతయ్య విలేకరులతో మాట్లాడుతూ దుంగలను స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని.. అయితే ఇవి ఎర్రచందనమా కాదా అనే విషయం ఫారెస్టు అధికారుల తనిఖీ అనంతరం వెల్లడిస్తామన్నారు.
 

Advertisement
Advertisement