మధిర రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి | Sakshi
Sakshi News home page

మధిర రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి

Published Thu, Sep 15 2016 11:35 PM

‘మధిర’ అనే ఆకారంలో కూర్చున్న విద్యార్థులు

  • ఒక్కటైన పార్టీలు
  • మధిరలో ర్యాలీ, రాస్తారోకో
  • మధిర : మధిర రెవెన్యూ డివిజన్‌ సాధనే ధ్యేయంగా విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు గురువారం ఆందోళన కార్యక్రమాలు చేశారు. స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిమీదుగా వైఎస్‌ఆర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. విద్యార్థులు ‘మధిర’ అనే అక్షరమాల ఆకారంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మధిర రెవెన్యూ డివిజన్‌ సాధన ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ వాసిరెడ్డి రామనాధం, చీదిరాల వెంకటేశ్వర్లు, బెజవాడ రవిబాబు, చెరుపల్లి శ్రీధర్, పెరుమాళ్లపల్లి విజయరాజు, కర్నాటి రామారావు, కరివేద వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రం, మున్సిపాలిటీగా ఉన్న మధిరను, ఎర్రుపాలెం మండలాలను మరొ డివిజన్‌లో ప్రభుత్వం కలపాలనుకోవడంలో అర్ధమేమిటని ప్రశ్నించారు. ఎటువంటి అర్హతలేని కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే యత్నం చేయడం, అన్ని అర్హతలు ఉన్న మధిరను పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న, స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకులు ఈ గడ్డపై జన్మించారని తెలిపారు. భౌగోళికంగా,  శాస్త్రీయంగా కనీసం మ్యాపులను పరిశీలించకుండా కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలనుకోవడాన్ని ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మధిర ఔన్నత్యాన్ని, అస్థిత్వాన్ని తగ్గించే కుట్రను మానుకోవాలన్నారు. లేకుంటే మధిర , ఎర్రుపాలెం మండలాలను ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగరపంచాయితీ చైర్‌పర్సన్‌ మొండితోక నాగరాణి, భరత్‌ జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ గుర్రం శ్రీకాంత్, శ్రీనిధి విద్యాసంస్థల అధినేత అనిల్‌కుమార్‌నెహ్రూ వివిధ పార్టీల నాయకులు తూమాటి నవీన్‌రెడ్డి, చావలి రామరాజు, తాళ్లూరి హరీష్‌బాబు, చెరుకూరి కష్ణారావు, రామిశెట్టి రోశయ్య, పాపట్ల రమేష్, తలుపుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
    రేపు మధిర, ఎర్రుపాలెం మండలాలు బంద్‌..
    మధిర రూరల్‌ : మధిరను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17న మధిర, ఎర్రుపాలెం మండలాల్లో బంద్‌ నిర్వహించనున్నట్లు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ వాసిరెడ్డి రామనాధం, నాయకులు తూమాటి నర్సిరెడ్డి,  చీదిరాల వెంకటేశ్వర్లు, మేకల లక్షి్మ, మందడపు నాగేశ్వరరావు, పెరుమాళ్లపల్లి విజయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు మండలాల ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా కల్లూరు రెవెన్యూ డివిజన్‌లో కలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ బంద్‌ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ బంద్‌కు ప్రజలు, వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ, కార్మిక వర్గాలు, విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.  

     

Advertisement
Advertisement