- స్వార్థం కోసం ఇద్దరు చంద్రులు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు
- రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి
తిరుపతి రూరల్ : అసెంబ్లీ స్పీకర్ల అమర్థత వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు సంతల్లో పశువుల్లా అమ్ముడు పోతున్నారని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు చేస్తున్న పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. పాలన చేతకాని ఇద్దరు చంద్రులు, తమ అసమర్థతపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే అనైతికంగా కోట్లాది రూపాయలతో ఎమ్మెల్యేను పశువుల్లా కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిన అసెంబ్లీ స్పీకర్లు అధికార పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించడం దారుణమన్నారు. స్పీకర్ వ్యవస్థనే భ్రష్టు పట్టించిన కోడెల శివప్రసాద్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దిగజారిన రాజకీయ విలువల నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే అమెరికాలో మాదిరిగా అధ్యక్ష పాలనను దేశంలోనూ అమలు చేయాలని సూచించారు. ఇప్పటికైనా పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్లు చర్యలు తీసుకోకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.