సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి రూ.2.07 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు మంగళవారం తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ) ద్వారా మంజూరైన పనుల వివరాలను సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. సిరిసిల్లలోని బార్ అసోసియేషన్ భవనం బ్యాలెన్స్ పని కోసం రూ.10 లక్షలు, పెద్ద మసీద్ సమీపంలోని కమ్యూనిటీ హాల్కు రూ. 10 లక్షలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ నీతుప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలాల్లోని 57 పనులకు రూ.1.76 కోట్లు మంజూరైనట్లు ఆఫీస్ వర్గాలు తెలిపాయి. ఇందులో కమ్యూనిటీ హాళ్లు, మహిళా సంఘ భవనాలు, ఆలయాలకు విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు ఉన్నాయి.