- నూతన నటీ నటులతో చిత్రం
– నిర్మాతగా డోన్కు చెందిన మహేష్ఖన్నా
– కెమెరా స్విచ్ఆన్ చేసి షూటింగ్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం కేఈ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : డోన్కు చెందిన పారిశ్రామిక వేత్త మహేష్ఖన్నా నిర్మాణ సారథ్యంలో సిద్ధయోగి సినీ కంబైన్స్ పతాకం పై సత్యాగ్యాంగ్ సినిమా షూటింగ్ బుధవారం జిల్లాలో ప్రారంభమైంది. కర్నూలులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ క్లాప్కొట్టి షూటింగ్ ప్రారంభించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలో నూతన నటీ నటులు హిరోలు ప్రత్యూష్, సాత్విక్, హీరోయిన్ హర్షితాలపై చిత్ర దర్శకుడు ప్రభాష్ నిర్మలా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాత డోన్లోని నిర్మాత స్వగృహం ఆవరణలో పోలీస్ స్టేషన్ సెట్ ఏర్పాటు చేసి పోలీస్ కమిషనర్గా ముఖ్యపాత్ర పోషిస్తున్న సుమన్, కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్న జీవాపై కొన్ని సీన్లు చిత్రీకరించారు.రాయలసీమ చరిత్రకు సంబంధించిన కథనంతో నడుస్తున్న సత్యాగ్యాంగ్ సినిమాను పూర్తిగా కర్నూలు జిల్లాలోనే చిత్రీకరించేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు నిర్మాత తెలిపారు.
78 చిత్రాల్లో నటించా - ప్రభాకర్
ఇప్పటి వరకు తెలుగులో 78, కన్నడంలో 12, తమిళంలో రెండు చిత్రాల్లో నటించినట్లు బాహుబలి కాలకేయ పాత్రధారి ప్రభాకర్ తెలిపారు. సత్యాగ్యాంగ్ చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్న ఈయన షూటింగ్ నిమిత్తం బుధవారం డోన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో ముచ్చటించారు. బాహుబలిలో నటించడంతో తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించినట్లు తెలిపారు. ప్రస్తుతం సత్యాగ్యాంగ్తో పాటు ఆక్సిజన్, నమోవెంకటేశాయా, డీకే చిత్రాల్లో నటిస్తున్నట్లు ప్రభాకర్ తెలిపారు.