వంద మంది టీచర్లకు సావిత్రీబాయి పూలే అవార్డులు | Sakshi
Sakshi News home page

వంద మంది టీచర్లకు సావిత్రీబాయి పూలే అవార్డులు

Published Sat, Dec 3 2016 10:27 PM

వంద మంది టీచర్లకు సావిత్రీబాయి పూలే అవార్డులు

కర్నూలు(అర్బన్‌): దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయినీ సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీన జిల్లాకు చెందిన వంద మంది ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, హెచ్‌డబ్ల్యూఓలకు అవార్డులను అందిస్తున్నట్లు బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ తెలిపారు. స్థానిక మద్దూర్‌నగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా ఇస్తున్నట్లే ఈ ఏడాది కూడా ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులతో సన్మానిస్తామన్నారు. సావిత్రీబాయి పూలే కృషి వల్లనే నేడు మహిళలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రీబాయి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ మహిళా కళాశాల వసతి గృహాలకు నేటి వరకు ఒక్క సొంత భవనం కూడా నిర్మించిన పాపాన పోలేదన్నారు. జనవరి 3న సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ శేషఫణి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి ఓంకార్‌యాదవ్, విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్, ఉపాధ్యాయులు భాస్కర్‌యాదవ్, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement