కర్నూలు(అగ్రికల్చర్): సర్వర్పై ఒత్తడి పెరగడంతో విత్తనాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఎన్టీఆర్ భరోస పింఛన్ల పంపిణీ, నేషనల్ ఇన్ఫర్మ్యాటిక్ సెంటర్(ఎన్ఐసీ).. సబ్సిడీపై విత్తనాల పంపిణీ.. వీటన్నింటికీ సర్వర్ ఒక్కటే. దీంతో నాలుగైదు రోజులుగా సర్వర్ మొండికేస్తోంది. జిల్లాకు వేరుశనగ 60,600 క్వింటాళ్లు కేటాయించారు. అయితే మండలాలకు 50,600 క్వింటాళ్లు కేటాయించి 10 వేల క్వింటాళ్లు బఫర్లో పెట్టారు. డిమాండ్ ఉన్న మండలాలకు అదనంగా ఇవ్వాలనేది బఫర్ ఉద్దేశం. ఇప్పటి వరకు వేరుశనగ 26,919 క్వింటాళ్లు పొజిషన్ చేశారు. సోమవారం సాయంత్రం నాటికి 17,820 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. కందులు 628 క్వింటాళ్లు, దయంచ 1,288 క్వింటాళ్లు, పిల్లి పెసర 33 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి.