- సబ్సిడీ అపరాల విత్తనాలపై సందేహాలు
రాయవరం:
రబీ అనంతరం అపరాల సాగు చేపట్టేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై మినుము విత్తనాలు సరఫరా చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారని, అయితే అవి మొలక రాక రైతులు నష్టపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి ప్రశ్నించారు. రాయవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఖరీఫ్ అనంతరం పీయూ 31 మినుము విత్తనాలను వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీపై సరఫరా చేసిందన్నారు. ఆ విత్తనం వేసిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇప్పుడు అవే విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వం 33 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నట్టు ప్రకటించిందని, మినుములు మార్కెట్లో క్వింటాల్కు రూ. 5,300 నుంచి రూ.5,500 వరకు ధర పలుకుతుండగా, ప్రభుత్వ సబ్సిడీ పోను కిలో రూ.65వరకు విక్రయించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా యంత్రాలతో వరికోతలు కోస్తున్నారని, అటువంటి పొలాల్లో పీయూ31, ఇతర ఏ విత్తనాలు వేసినా విత్తనాలకు జర్మినేష¯ŒS ఉండదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ విత్తనాలు మొలకెత్తినా మెడవిరుపు తెగులు అధికంగా సోకుతుందన్నారు. అపరాలు, పచ్చిరొట్ట విత్తనాలను ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫసల్ బీమా యోజన బూటకం
ఫసల్ బీమా యోజన బూటకమని ఆయన విమర్శించారు. బీమా నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వలన రైతులకు ఎటువంటి ప్రయోజనం ఒనగూరడం లేదన్నారు. గత ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ జేడీ సిఫార్సు చేసినా కూడా బీమా వర్తింపచేయలేదని, దీనిని బట్టే ఫసల్ బీమా యోజన అమలు తీరు ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణాపుల్లేష్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి, ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి (చినకాపు), సత్తి వీరవెంకటరెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.