కర్నూలు: బాలలను శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన శిక్షకు గురి కావాల్సి వస్తుందని జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు. బాలల న్యాయ చట్టం గురించి న్యాయ సేవాసదన్లో సోమవారం లాయర్లకు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘బాలల న్యాయ మండలి చట్టం–2015’ అనే అంశంపై సీఆర్ఏఎఫ్ సహకారంతో కర్నూలు చైల్డ్ ఫోరం, జిల్లా న్యాయాధికార సంస్థ అనుసంధానంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సోమశేఖర్, మహిళా పీఎస్ డీఎస్పీ వెంకటాద్రి, సీఐ సురేంద్ర, క్రాప్ ప్రతినిధి వెంకటయ్య, కె.ఎన్.ఎన్ కర్నూలు డివిజనల్ చైర్మన్ మద్దిలేటి, సైకాలజిస్టు సలీం బాషా తదితరులు హాజరై బాలల హక్కుల గురించి వివరించారు.
కర్నూలు చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షులు విజయరాజు అధ్యక్షతన జరిగిన వర్క్షాప్లో అనుపమ చక్రవర్తి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు వయస్సు వారందరూ బాలలేనన్నారు. 18 సంవత్సరాల లోపు నేరం చేసిన బాలలు చట్టంలో సంఘర్షణ, రక్షణ అవసరమైన బాలల కోసం ఈ చట్టం ప్రతి జిల్లాలో న్యాయమండలి ఉంటుందన్నారు. న్యాయమండలి నేరారోపణ చేయబడిన బాలలు, చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలల కేసులను పరిష్కరించి వారికి రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ చట్టం ప్రకారం బాలల వివరాలను మీడియాలో ప్రచురించడం, ప్రసారం చేయడం నేరమవుతుందన్నారు. చైల్డ్ రైట్స్ ఫోరం కార్యదర్శి చిన్నయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.