Sakshi News home page

'ఆరుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు'

Published Tue, May 31 2016 2:47 PM

'ఆరుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు' - Sakshi

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం పశ్చాత్తాపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, సంజీవయ్య అన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని వారు మంగళవారమిక్కడ తెలిపారు. అయితే వారి వివరాలు చెప్పాలని విలేకర్లు అడగగా, సమయం వచ్చినప్పుడు తామే బయటపెడతామని వారు పేర్కొన్నారు.  రాజ్యసభకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డిదే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన 17మంది టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. రాజ్యసభకు నాలుగో అభ్యర్థి విషయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు నిన్న సమావేశం అయ్యారు. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు వారిని ముందుగా తిరుపతి, ఆ తర్వాత విజయవాడ, అనంతరం హైదరాబాద్ అంటూ తిప్పుతున్నారు. ఇక చంద్రబాబుతో భేటీ సమయంలో వారి సెల్ఫోన్లు కూడా సెక్యూరిటీ సిబ్బంది తీసుకున్న తర్వాతే లోనికి అనుమతించినట్లు తెలుస్తోంది.

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వడం ఇష్టం లేదన్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను విమర్శించేందుకే మహానాడు నిర్వహించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పేదల గుండెల్లో ఉన్న వైఎస్ఆర్ సీపీని ఏమీ చేయలేరని నల్లపరెడ్డి అన్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు.

Advertisement
Advertisement