- రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
- వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి
తాడిపత్రి: ప్రతి ఏడాది జిల్లాలో 63 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటన చేయడం మినహా జిల్లా రైతులను ఆదుకున్న పాపాన పోలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంతవెంట్రామిరెడ్డి తెలిపారు. పెద్దవడుగూరు మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో కరువు మండలాలుగా ప్రకటించి ఏం చేయలేదని విమర్శించారు. రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. కరువుతో ఇప్పటికే జిల్లాలో వలసలు కూడా మొదలయ్యాయనీ.... కరువు నివారణకు చేయాల్సిన సహాయక చర్యలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేతలు ప్రచారం చేసుకునేందుకు మాత్రమే ముందు ఉంటారని, రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందారన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు సాగునీరు అడిగితే విసుక్కుంటున్నారనీ.. రైతులు తుంగభద్ర జలాలను ఆడిగితే రైతులపై మండిపడం ఏంటనీ ప్రశ్నించారు. సాగు, తాగునీరు కూడా సరిగా అందించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పంపిణీలో కూడా ఏ మాత్రం కూడా స్పష్టత లేదని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు గుడూరు సూర్యనారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.ఆర్.వెంటేశ్వరరెడ్డి, పెద్దవడుగూరు మండల కన్వీనర్ శరబారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పాశం రంగస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.