పెద్దకడబూరు : కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలో బారిక వసంతప్ప(65) అనే వ్యక్తిని కుమారుడు యల్లప్ప గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బారిక వసంతప్ప, మారెమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. వీరికి నాలుగు ఎకరాల పొలం ఉంది. మొదటి, రెండో కుమారుడు భార్యా పిల్లలతో బెంగళూరుకు వలస వెళ్లారు. నాల్గో కుమారుడు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడో కుమారుడు యల్లప్ప తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. నలుగురు కుమార్తెలకు వివాహమైంది.
వీరిలో లింగమ్మను ఎనిమిదేళ్ల క్రితం భర్త వదిలివేయడంతో పుట్టింట్లో ఉంటోంది. మూడు రోజుల నుంచి తండ్రి వసంతప్ప, కుమారుడు యల్లప్ప మధ్య కుటుంబ గొడవలు తలెత్తాయి. శుక్రవారం రాత్రి కూడా చిన్నపాటి గొడవ జరిగింది. లింగమ్మకు రెండో పెళ్లి చేయాలని యల్లప్ప తండ్రిని పట్టుబట్టాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని అతను చెప్పినా..యల్లప్ప వినలేదు. కాగా.. వసంతప్ప శనివారం తెల్లవారుజామున కుమారుడిని త్వరగా నిద్రలేచి పొలం పనులకు వెళ్లాలని సూచించాడు. దీంతో ఆవేశానికి లోనైన యల్లప్ప మంచంపై పడుకున్న తండ్రిని గొడ్డలితో గొంతుభాగంలో నరికి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. కోసిగి ఇన్చార్జ్ సీఐ గౌస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హతుడి భార్య మారెమ్మ íఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.