ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. మమకారంతో పాటు మానవత్వాన్ని మరిచాడో కొడుకు. తనకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వటం లేదని తండ్రిని పెట్రోలు పోసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంకొల్లుకు చెందిన రిటైర్డు హెడ్మాస్టర్ వల్లభనేని వెంకట్రాయుడు (60) కుమారుడు తులసి జులాయిగా తిరుగుతున్నాడు. అయితే కొడుకు ప్రవర్తన నచ్చని తండ్రి అతడికి డబ్బులు ఇవ్వడం మానేశారు. దీంతో కసి పెంచుకున్న తులసి ...తండ్రిని చంపి పెట్రోలు పోసి తగులబెట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తండ్రి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా ధూళిపూడి బస్ షెల్టరులో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇంకొల్లుకు చెందిన వెంకట్రాయుడుగా గుర్తించారు. విచారణలో తులసి తాను చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడని సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు.