పంట మార్పిడికి పక్కాప్రణాళిక | Sakshi
Sakshi News home page

పంట మార్పిడికి పక్కాప్రణాళిక

Published Thu, Apr 6 2017 11:34 PM

special plan to crop change

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో వేరుశనగలాంటి ఒకే పంట విధానానికి స్వస్తి పలికేందుకు పంట మార్పిడిని ప్రోత్సహించేలా గ్రామస్థాయిలో ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళిక(విలేజ్‌ యాక‌్షన్‌ప్లాన్‌) తయారు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ - 2 ఖాజామొహిద్దీన్‌ సూచించారు. స్థానిక కృష్ణ కళామందిరంలో గురువారం వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అధ్యక్షతన విలేజ్‌ యాక‌్షన్‌ప్లాన్‌పై అనంతపురం, ఉరవకొండ వ్యవసాయ డివిజన్ల ఏడీఏ, ఏవో, ఏఈవో, ఎంపీఈవోలతో సమావేశం నిర్వహించారు. అందులో జేసీ - 2 మాట్లాడుతూ వేరుశనగ విస్తీర్ణాన్ని బాగా తగ్గించి దాని స్థానంలో ఇతర పంటలు సాగుచేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.

వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా ఐదారు రకాల పంటలు వేస్తే ఏదో ఒకటి చేతికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా కేవలం వేరుశనగ పంటను నమ్ముకోవడం వËల్లే ఏటా రైతులు నష్టపోతున్నారని అన్నారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ వేరుశనగ పంటను ప్రోత్సహిస్తూనే చిరుధాన్యాలు, నవధాన్యపు, పప్పుధాన్యపు పంటలను సాగులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంట మార్పిడిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఆత్మ పీడీ డాక్టర్‌ పెరుమాళ్ల నాగన్న, ఇతర అధికారులు, డాట్‌ సెంటర్, కేవీకే, ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement