– ఇండికా కారు ఢీకొని కూలీ మృతి
కల్లూరు(రూరల్): అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కర్నూలు మండలం వెంకాయపల్లెలోని శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా ఏపీ 29 ఏబీ 0078 ఇండికా కారు ఢీకొనడంతో దాచేపల్లి మహబూబ్ సుభాని (28) అనే కూలీ మృతి చెందాడు. ఈయన గుంటూరు జిల్లా నగరకల్లు మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన హుస్సేన్ కుమారుడిగా తేలింది. పనులు చేసేందుకు రెండు నెలల క్రితం కర్నూలుకు వలస వచ్చాడు. శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఉంటూ ట్రాక్టర్లకు ఇసుక నింపేందుకు కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి 6.45 నిమిషాలకు శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయం ఎదుట బహిర్భూమికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఇండికా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. తలపగిలి తీవ్ర రక్తసావ్రంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న వారు గమనించి వెంటనే ఇండికా కారును వెంబడించగా కారును వదిలేసి డ్రై వర్ పరారయ్యాడు. సమాచారం తెలిసిన కర్నూలు తాలూకా ఎస్ఐ ఎస్ అబ్దుల్ గఫూర్, ఏఎస్ఐ జాఫర్ సాహెబ్ ఘటన స్థలానికి చేరుకుని మతదేహాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందని వెంకాయపల్లెకు చెందిన తోటి కూలీలను అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు. విషయం తెలిసిన భార్య హుస్సేన్బీ సంఘటన స్థలానికి చేరుకుని భర్త మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈయనకు భార్య, కుమార్తె మున్ని ఉన్నారు. మతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, ఇండికా కారు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు కర్నూలు తాలూకా ఎస్ఐ తెలిపారు.