వరాలిచ్చే స్వామి వరుడైనాడు.. | Sakshi
Sakshi News home page

వరాలిచ్చే స్వామి వరుడైనాడు..

Published Tue, May 17 2016 9:30 AM

వరాలిచ్చే స్వామి వరుడైనాడు..

 ► సత్యదేవుని కల్యాణోత్సవాలు ప్రారంభం
 ► నూతన వధూవరులుగా స్వామి, అమ్మవారు
 ► ఛలోక్తులతో అలరించిన ఎదుర్కోలు ఉత్సవం
 ►నేటి రాత్రి 9.30 గంటల నుంచి కల్యాణ క్రతువు

 
అన్నవరం: రత్నగిరి పెళ్లికళతో తుళ్లిపడుతోంది. ఎటు చూసినా పచ్చని తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపమాలికలతో శోభాయమానంగా భాసిస్తోంది. భక్తవరదుడు సత్యదేవుడు, ఆయన దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవిల దివ్య కల్యాణోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యూరుు. తొలిఘట్టం గా స్వామి, అమ్మవార్లను వధూవరులను చేశారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లిపెద్దలు, క్షేత్రపాలకులు శ్రీసీతారాములు వెంటరాగా స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా మండపానికి తోడ్కొని వచ్చారు.

ప్రత్యేకాసనాలపై సీతారాములను, వెండి సింహాసనంపై స్వామి, అమ్మవార్లను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ నాగేశ్వరరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసిన అనంతరం ముత్తయిదువలు పసుపు దంచారు. కాగా స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవాన్ని  రాత్రి 7.30 గంటలకు శ్రీరాజా రామరాయ కళావేదికపై నిర్వహించారు. ప్రముఖ పండితుడు చిర్రావూరి శ్రీరామశర్మ, ఈఓ నాగేశ్వరరావు తదితరులు  స్వామి తరఫున, అర్చక స్వాములు కొండవీటి సత్యనారాయణ, ఏసీ ఈరంకి జగన్నాథరావు తదితరులు అమ్మవారి తరఫున ఛలోక్తులతో వాదులాడుకోవడం అలరించింది.
 
ఇదీ నేటి కల్యాణోత్సవ క్రమం..
 మంగళవారం రాత్రి 9.30 గంటలకు కల్యాణోత్సవం ప్రా రంభమవుతుంది. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున మంత్రులు, దేవస్థానం తరఫున ఈఓ, టీటీడీ తరఫున ఆ దేవస్థానం ప్రతినిధులు పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారు. విఘ్నేశ్వరపూజ తదితర ఘట్టాల అనంతరం రాత్రి 11 గంటలకు స్వామి తరపున అర్చకస్వామి అమ్మవారి మెడలో మంగళసూత్రధారణ చేయడంతో కల్యాణక్రతువు ముగుస్తుంది.
 
నేటి వైదిక కార్యక్రమాలు
 తెల్లవారుజామున 3.00 గంటలకు:  సుప్రభాత సేవ, ఉదయం 8.00 గంటలకు: చతుర్వేదపారాయణ, 9.00 గంటలకు: అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణ, దీక్షావస్త్రధారణ, సాయంత్రం 6.30 గంటలకు: కొండదిగువన శ్రీస్వామి, అమ్మవార్లకు వెండి గరుడ వాహనంపై, శ్రీసీతారాములకు వెండి పల్లకీ మీద ఊరేగింపు, రాత్రి.9.30 గంటల నుంచి కొండపై స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం.
 
నేటి సాంస్కృతిక కార్యక్రమాలు

 రత్నగిరిపై శ్రీరాజా వేంకట రామారాయ కళామందిరంలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు: పెండ్యాల నాగేశ్వరరావు బృందం భజన, 8 నుంచి 9 గంటల వరకు ఎస్.నాగలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు: పోల్నాటి గోవిందరావు భక్తి ప్రవచనాలు, 6 నుంచి 9 గంటల వరకు: ఆకెళ్ల లక్ష్మీపద్మావతి బృందం కూచిపూడి నృత్యం, అనంతరం శ్రీఅన్నమాచార్య వాగ్గేయ వరదాయిని బృందం కోలాటం.

Advertisement

తప్పక చదవండి

Advertisement