- ప్రముఖ రచయిత ఇనాక్
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం వేదికగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ అక్షర యాత్ర ప్రారంభమైందని ప్రముఖ రచయిత, పద్మశ్రీ ఇనాక్ అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటైన పుస్తక ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల దగ్గరకు సాహిత్యాన్ని తీసుకెళితే సమాజంలో మార్పులు వస్తాయన్నారు. విద్యార్థులతో పాఠ్య పుస్తకాలే కాకుండా సాహిత్యాన్ని, సమాజంపై అవగహన పెంచే పుస్తకాలను చదివించాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సాహిత్యాన్ని దగ్గర చేసే ఉద్దేశ్యంతోనే కొత్తగూడెం నుంచి పుస్తక ప్రదర్శన యాత్ర మొదలుపెట్టామన్నారు. ఈ ప్రదర్శన కు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు ఖమ్మంలో బుక్ఫెయిర్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ రమేష్బాబు, డాక్టర్ సుబ్బారావు, బుక్ ఫెయిర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.