దళితులపై దాడులకు దిగితే కఠిన చర్యలు | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులకు దిగితే కఠిన చర్యలు

Published Thu, Aug 11 2016 9:48 PM

దళితులపై దాడులకు దిగితే కఠిన చర్యలు

మంత్రి కిషోర్‌బాబు
అమలాపురం :
దళితులపై దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూదాపాలెం దళిత సోదరులను రాజప్ప గురువారం ఉదయం పరామర్శించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను ఆర్డీవో జి.గణేష్‌కుమార్, డీఎస్పీ లంక అంకయ్య మంత్రి రాజప్పకు వివరించారు. ఈ దాడి గురించి రాజప్పకు వివరించిన దండోరా నాయకులు దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజప్పతోపాటు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెచ్చెట్టి విజయలక్ష్మి, కోనసీమ దండోరా అధ్యక్షుడు గంపల సత్యప్రసాద్‌ తదితరులు బాధితులను పరామర్శించారు.
దాడి బాధితులకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు : మంత్రి కిషోర్‌బాబు
సూదాపాలం దాడి బాధిత దళిత సోదరులిద్దరికీ లేదా వారి కుటుంబాల్లో ఎవరో ఒకరికి ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తుందని రాష్ట్ర  సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు హామీ ఇచ్చారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాడి బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత సోదరులపై దాడి చేసినప్పుడు యెరుబండి అబ్బులు తన పేరు చెప్పి మరీ దాడి చేయటాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని డీఎప్పీ అంకయ్యకు మంత్రి సూచించారు. దాడి సంఘటన వివరాలను మంత్రికి ఆర్డీఓ జి.గణేష్‌కుమార్‌ తెలియజేశారు.
పోలీసులకు మంత్రి అభినందన
దాడి సమయంలో సమయస్ఫూర్తితో సకాలంలో పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవటం వల్లే అనర్థాలు జరగలేదని మంత్రి రావెల అన్నారు. అమలాపురం పోలీసులను ఈ విషయంలో అభినందిస్తున్నానని చెప్పారు. దళిత నాయకులు మోకాటి నాగేశ్వరరావు, బొమ్మి ఇజ్రాయిల్‌ కూడా మంత్రికి ఘటన గురించి వివరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement