సెల్‌టవర్‌ ఎక్కిన క్యాన్సర్‌ బాధితుడు | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్‌ ఎక్కిన క్యాన్సర్‌ బాధితుడు

Published Tue, Jul 19 2016 11:08 PM

సెల్‌టవర్‌ ఎక్కిన క్యాన్సర్‌ బాధితుడు

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను డిమాండ్‌
అర్ధవీడు : ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు స్పందించి తన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఓ క్యాన్సర్‌ బాధితుడు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళ్తే... నాగులవరం గ్రామానికి చెందిన ఉప్పుతల నాగరాజు (35) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాలుగేళ్లుగా నాగరాజు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కర్నూలు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ నయం కాకపోగా, ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. దీంతో తన కారును కూడా అమ్ముకున్నాడు. భార్య కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం, ఎవరూ ఆదుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు.. సెల్‌టవర్‌ ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చి తన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశాడు. సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్‌ జీఎస్‌ఎం ప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకుని నాగరాజుతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నాగరాజు కిందకు దిగాడు.

Advertisement
Advertisement