డిప్యూటీ తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష | Sakshi
Sakshi News home page

డిప్యూటీ తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష

Published Fri, Jan 13 2017 12:11 AM

Tahasildarku deputy sentenced to two years in prison

 
కర్నూలు(లీగల్‌): రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలోని డిప్యూటీ తహశీల్దార్‌ తిరుపతి కుమార్‌కు కర్నూలు ఏసీబీ కోర్టు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. కానగానపల్లె మండలం, కుర్లపల్లి గ్రామానికి చెందిన అల్లాబాషాకు పునరావాసం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అదే మండలానికి చెందిన మరో వ్యక్తి తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిందని స్వాధీన పరుచుకున్నారు. ఈ విషయంపై అల్లాబాషా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. సంబంధిత డిప్యూటీ తహశీల్దారు ఆ ఫైల్‌ చూస్తున్నారని తెలిసి ఆయనను కలిశాడు. సానుకూలమైన ఉత్తర్వులు ఇప్పించేందుకు అధికారి రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. 2013 జూన్‌ 11వ తేదీన లంచం రూ.30 వేలు తీసుకుంటుండగా, అనంతపురం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు. అతనిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో డిప్యూటీ తహశీల్దారుపై నేరం రుజువు కావడంతో రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రెండు 2 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.సుధాకర్‌ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరుపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హెచ్‌.వెంకటేష్‌ వాదించారు.    

Advertisement
Advertisement