– నలుగురికి గాయాలు
– 8 మందిపై కేసు నమోదు
పెద్దహోతూరు(ఆలూరు రూరల్) : గ్రామంలో టీడీపీ వర్గీయులు రెండువర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు మంగళవారం అర్ధరాత్రి దాడులకు దిగారు. ఈ దాడుల్లో సర్పంచ్ పూజారి హనుమంతమ్మ వర్గీయులు ఇద్దరు, కురువ లక్ష్మన్న వర్గీయులు ఇద్దరు గాయపడ్డారు. ఘర్షణ జరుగుతున్న విషయాన్ని ఆలూరు పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఎస్ఐ ధనుంజయ, పోలీస్ సిబ్బంది గాయపడిన ఇరువర్గాలకు చెందిన కమ్మ రవి, ఉచ్చప్ప, లక్ష్మన్నతో పాటు మరొకరిని ఆలూరు ఆస్పత్రికి చికిత్సల కోసం తీసుకెళ్లారు. ఘర్షణకు కారణమైన ఇరువర్గాలకు సంబంధించిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. గ్రామంలో ఈ ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో టీడీపీకి చెందిన లక్ష్మన్న వర్గీయులు పెద్దఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని సర్పంచ్ కామాక్షమ్మ వర్గీయులు ఆరోపించారు. వారం క్రితం గ్రామానికి వెళ్లిన సామాజిక తనిఖీ బృందానికి కూడా విషయాన్ని తెలియజేశారు. అంతటితో ఆగకుండా మూడు రోజులక్రితం బహిరంగ విచారణలో ఇదే విషయాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే ఉన్న మరో టీడీపీ వర్గం నాయకులు ఘర్షణ దిగడంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. ఈ విషయంపైనే మంగళవారం అర్ధరాత్రి గ్రామంలో ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో ఎస్ఐ ధనుంజయ బందోబస్తు ఏర్పాటు చేశారు.