హత్య కేసులో టీడీపీ నాయకుడి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

హత్య కేసులో టీడీపీ నాయకుడి అరెస్ట్

Published Sat, Mar 12 2016 7:01 PM

tdp leader arrested in guntur district murder case

పిడుగురాళ్ల: గుంటూరుజిల్లాలో జరిగిన ఓ హత్యకేసులో టీడీపీ నాయకుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పిడుగురాళ్లకు చెందిన టీడీపీ సర్పంచ్ భర్త కాశీ విశ్వనాధ్ తన వ్యాపార భాగస్వామి అయిన కరీంను అత్యంత దారుణంగా హతమార్చి పోలీసులకు చిక్కాడు.

వివరాల్లోకి వెళితే....పిడుగురాళ్లకు చెందిన సయ్యద్ కరీం ఆరు నెలల క్రితం హత్యకు గురయ్యాడు. కరీం మృతికి సంబంధించి అనుమానాలున్నాయని ఆయన భార్య షెహనాజ్ రూరల్ ఎస్పీని ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కరీం మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కరీం చనిపోవడానికి ముందు అతను తాగిన మద్యంలో విషం కలిసి ఉందని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

కరీం మృతికి ముందు తన వ్యాపార భాగస్వామి అయిన కాశీ విశ్వనాధ్తో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా మర్డర్ మిస్టరీ వీడింది. తన వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన కరీం నూతనంగా బయో కెమికల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కరీం ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే.. తనకు ఇబ్బందితో పాటు వ్యాపార రహస్యాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అతని చంపాలని విశ్వనాధ్ కుట్రపన్నాడు. అందులో భాగంగా కరీంకు మద్యంలో విషం కలిపి తాగించాడు. విశ్వనాధ్తో పాటు 8మంది నిందితులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement