వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌పై దాడి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌పై దాడి

Published Tue, Sep 6 2016 11:23 PM

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌పై దాడి - Sakshi

పోలీసుల సమక్షంలో టీడీపీ నేత దాషీ్టకం
రోడ్డుపై పార్టీ శ్రేణుల నిరసన


పుట్టపర్తి టౌన్‌/ బుక్కపట్నం : తెలుగు దేశం నాయకులు దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దౌర్జన్యకాండకు పాల్పడుతున్న పచ్చచొక్కా నాయకులు తాజాగా మంగళవారం పుట్టపర్తిలో  ప్ర జా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ను పోలీసులు సమక్షంలోనే ఓ టీడీపీ నాయకుడు అనుచరులతో కలిసి దాడి చేసిన ఘటన పుట్టపర్తిలో ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు.. మంగళవారం మధ్యాహ్నం ప్రజామస్యలు చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ నారాయణరెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆయన లేకపోవడంతో మున్సిపల్‌ ఇంజనీర్‌ చాంబర్‌కు వెళ్లి  ఇంజనీర్, మేనేజర్‌తో సమస్యలపై చర్చిస్తుండగా.. టీడీపీ నాయకుడు, కాంట్రాక్టర్‌ కోళ్ల రమణ అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆయన పాలకమండలి కౌన్సిలర్లు దద్దమ్మలని, చేతగానితనంతో పనులు జరగడడంలేదని తిట్ల దండకానికి పూనుకున్నాడు.

అక్కడే ఉన్న కౌన్సిలర్‌నారాయణరెడ్డి అభ్యంతరం తెలిపాడు. దీంతో రెచ్చిపోయిన  ఆయన నారాయణరెడ్డిపై చేయిచేసుకోవడంతోపాటు, దుర్భాషలాడాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో  అక్కడే ఉన్న ఇంజనీర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, పోలీసులు ఇంజనీర్‌ కార్యాలయానికి చేరుకోవడంతో కౌన్సిలర్‌ నారాయణరెడ్డి పరిస్థితి వివరించారు. అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న కౌన్సిలర్‌ నారాయణరెడ్డిపై బయట వేచి ఉన్న టీడీపీ నాయకుడు కోళ్ల రమణ, ఆయన అనుచరులు పోలీసులు సమక్షంలోనే  రెచ్చిపోయి దాడి చేశారు. నారాయణరెడ్డి మోహంపై కంటి సమీపంలో రక్తగాయాలయ్యాయి. వెంటనే పోలీస్‌స్టేçÙన్‌కు చేరుకున్న నారాయణరెడ్డి అప్పటికే అక్కడికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్‌.హరికృష్ణ, పార్టీ రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీ లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, మండల పట్టణ కన్వీనర్లు గంగాద్రి, మాధవరెడ్డి, ఇతర నాయకులతో కలసి  కోళ్ల రమణఫై ఫిర్యాదు చేశారు.

పోలీసుల నిర్లక్ష్యంపై నిరసన
ఫిర్యాదుపై సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తక్షణమే చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీస్‌స్టేçÙన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పుట్టపర్తి పట్టణ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి స్టేషన్‌కు చేరుకుని, బాధితుడికి న్యాయం చేస్తామని, దాడికి పాల్పడ్డ కోళ్ల రమణను అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఇక్కడ న్యాయం జరగకపోతే  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామన్నారు.

Advertisement
Advertisement