ఎంపీ మల్లారెడ్డితోపాటే కారెక్కనున్న తెలుగు తమ్ముళ్లు
మేడ్చల్ : తెలంగాణలోని ఏకైక టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి గులాబీ గూటికి చేరడం ఖాయం కావడంతో మేడ్చల్ నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ కానుంది. ఎంపీ మల్లారెడ్డి బుధవారం సీఎం కేసిఆర్ను కలవనుండడంతో ఎంపీ అనుచరులు పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఎంపీ మల్లారెడ్డికి ప్రధాన అనుచరులు మేడ్చల్ మండలంలోనే అధికంగా ఉండడంతో మేడ్చల్లో టీడీపీ దాదాపు ఖాళీ కానుంది. మండల టీడీపీ అధ్యక్షుడు, ఎంపీ బావమరిది మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, కండ్లకోయ, రాయిలాపూర్, గౌడవెళ్లి సర్పంచ్లు నరేందర్రెడ్డి,నర్సింహా, మాధవి, ఎంపీటీసీ స్వామి, రజిత, భాగ్యశ్రీ, పట్టణ నాయకులు నర్సింహారెడ్డి, భాగ్యారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంతిరెడ్డి, కీసర మండల జెడ్పీటీసీ రమాదేవి, బండ్లగూడ ఎంపీటీసీ వనిత, శామీర్పేట, ఘట్కేసర్ మండలాలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు తమ అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. ఎంపీతోపాటు కాకుండా ఈ నెల 9న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.