మరో 4 ఆలయాల పాలకమండళ్ల భర్తీకి నోటిఫికేషన్‌ | Sakshi
Sakshi News home page

మరో 4 ఆలయాల పాలకమండళ్ల భర్తీకి నోటిఫికేషన్‌

Published Wed, Sep 21 2016 1:20 AM

Temple notification to the Governing Board

అర్వపల్లి
తుంగతుర్తి నియోజకవర్గంలో 6(సి) విభాగంలో గల మరో నాలుగు దేవాలయాల పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న తుంగతుర్తిలోని శ్రీపట్టాభిసీతారామ చంద్రస్వామి, నూతనకల్‌ మండలం మిర్యాల గ్రామంలోని సీతారాచంద్రస్వామి ఆలయం, శాలిగౌరారం మండలం ఇటుకుల పహాడ్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శ్రీమహాదేవి స్వామి ఆలయాల కమిటీలకు దరఖాస్తులు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈనెల 26 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువు ఉంది. ధర్మకర్తల మండలి కోసం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు గట్టిగానే పోటీ పడుతున్నారు.
అర్వపల్లి, ఫణిగిరి ఆలయాలకు నేటితో గడువు పూర్తి
అర్వపల్లిలోని శ్రీయోగానందలక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, ఫణిగిరిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాల పాలకమండళ్ల నియామకానికి దరఖాస్తుల గడువు బుధవారంతో పూర్తి కానుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ మండల నాయకులు పలువురు ఆలయ చైర్మన్లు పదవుల కోసం దరఖాస్తులు చేశారు.
ఏడాది పదవీ కాలం
ఆలయ కమిటీలకు సంబంధించి ఏడాది పాటు పదవీ కాలం ఉంటుంది. ఆ తర్వాత వీటి గడువు పొడగించే అవకాశం కూడా ఉండొచ్చు. కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటారు. అలాగే దేవాలయ పూజారిని ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా నియమిస్తారు. ఏడుగురు సభ్యులలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు.

Advertisement
Advertisement