యువకుడిని బలిగొన్న అతివేగం | Sakshi
Sakshi News home page

యువకుడిని బలిగొన్న అతివేగం

Published Sun, Aug 21 2016 12:18 AM

యువకుడిని బలిగొన్న అతివేగం

  • బైక్‌ అదుపు తప్పి కిందపడటంతో ఒకరి మృతి
  • మరొకరికి తీవ్ర గాయాలు
  • అశ్వారావుపల్లి(రఘునాథపల్లి) : మండలంలోని అశ్వారావుపల్లి రిజర్వాయర్‌ వద్ద స్నేహితులతో సరదాగా గడిపి తిరిగి వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అశ్వారావుపల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపల్లికి చెందిన ఎండీ మహ్మద్‌ దస్తగిరి, బదర్‌బీ దంపతులకు కుమారుడు ఎండీ.ఆసిఫ్‌(22), నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు ఆసిఫ్‌ హైదరాబాద్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. శనివారం తన ఐదుగురు స్నేహితులు రాజయ్య, జ్ఞానారెడ్డి, బడితె సాయి, హరీష్, షాబాజ్‌లతో కలిసి మూడు ద్విచక్రవాహనాలపై అశ్వారావుపల్లి రిజర్వాయర్‌ డ్యామ్‌ వద్ద సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో ఆసిఫ్‌ తన బైక్‌పై స్నేహితుడు షాబాజ్‌తో కలిసి ఇంటికి బయలుదేరాడు. బైక్‌ను అతి వేగంగా నడుపుతుండగా అశ్వారావుపల్లి దాటిన తర్వాత లోలెవల్‌ కాజ్‌ వే వద్ద వాహనం అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆసిఫ్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, షాబాజ్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే ఆటోలో షాబాజ్‌ను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడు ఆసిఫ్‌ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఎస్సై రంజిత్‌రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement