అవినీతి ‘పిత’ | Sakshi
Sakshi News home page

అవినీతి ‘పిత’

Published Thu, Nov 3 2016 1:43 AM

అవినీతి ‘పిత’ - Sakshi

వసూల్ రాజాగా మారిన యువ ఎమ్మెల్యే తండ్రి
అడ్డగోలు ఆర్జనకు ద్వారాలు తెరిచిన వైనం
అనుమతి లేకుండా రెడ్ గ్రావెల్ తవ్వకాలు
ఏ పనిచేసినా ఈయనకు ముట్టజెప్పాల్సిందే


ఆయన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. అధికార పార్టీకి చెందిన యువ ఎమ్మెల్యేకి తండ్రి. ఇవి చాలవా పెత్తనం చెలాయించడానికి. రెవెన్యూ నుంచి పంచాయతీ  వరకు అన్ని శాఖలు ఆయనకు కనీస ముడుపులు చెల్లించాల్సిందే. కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తమ పార్టీ మండల ప్రెసిడెంట్లనే ఏజెంట్లుగా నియమించుకున్నారని సమాచారం. ఈ నేత దందా గురించి పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి తె లియజేసినా ఫలితం లేకపోయిందని భోగట్టా.

చిత్తూరు: టీడీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న తమిళ ప్రభావ నియోజకవర్గంలో అధికార పార్టీనేత అవినీతి పెచ్చరిల్లుతోంది. సాక్షాత్తూ ఎమ్మెల్యే తండ్రి అక్రమార్జనకు అంతులేకుండాపోతోంది. ఈ నియోజకవర్గానికి 609 ఎన్టీయార్ గృహాలు కేటాయించారు. లబ్ధిదారులనుంచి రూ.20 వేల వంతు న ఆయన వసూలు చేసినట్టు సమాచారం. ఆయనకు చెందిన పార్టీ ఏజెంట్లు ఈ వసూలులో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. ఈ డబ్బును జిల్లా పార్టీ ముఖ్యులకు కూడా పంచినట్టు తెలుస్తోంది. నీరు చెట్టు పనులు సినిమా సెట్‌ను తలపిస్తున్నాయని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఒక కెనాల్, మరో చెరువు పనులు చేయకుండానే చేసినట్లు అధికారులతో కుమ్మక్కయి బిల్లులు చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులు మొత్తం ఆ నేత కనుసన్నలో జరగడంతో టీడీపీ కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతున్నారు.

రెడ్ గ్రావెల్‌కు చెన్నైలో అధిక డిమాండ్ ఉంది. ఈ నగరం వంద కిలోమీటర్లలోపే ఉండటం.. నియోజకవర్గంలో నాణ్యమైన గ్రావెల్ లభిస్తుండ టం ఆయనకు కలిసివస్తోంది. అక్రమ తవ్వకాల సొమ్ము నుంచి సంబంధిత అధికారులకు కొంత ముట్టజెబుతారని టీడీపీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈయన తవ్వుతున్న గ్రావెల్ క్వారీల్లో సగానికి పైగా అనుమతులే లేవు.   నియోజకవర్గంలో సుమారు 43 మద్యం షాపుల నుంచి ప్రతి నెలా రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు  స్టేషన్‌హౌస్ ఆఫీసర్ ఒకరు సహకరిస్తున్నారని సమాచారం. ఆ పోలీసు అధికారే ప్రతి నెలా వసూలు చేసిన సొమ్మును ఎమ్మెల్యే తండ్రికి అప్పగిస్తున్నారని ఆ నియోజవకవర్గంలోని పోలీసు అధికారులే చెప్పుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఆయన నెలవారీ మామూళ్లు వసూలు చేస్తారని సమాచారం. మాట వినని అధికారులను నయానో భయనో దారికి తెచ్చుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలు కచ్చితంగా ప్రతి నెలా రూ.50 వేలు చెల్లించాల్సిందేనని సమాచారం.

గత ఆర్థిక సంవత్సరం జరిగిన బదిలీల్లో రెవెన్యూ శాఖలో పని చేసే ఓ వీఆర్వో పక్క మండలానికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. బదిలీని నిలపాల్సిందిగా సదరు టీడీపీ నేతను కోరగా రూ.7 లక్షలు డిమాండ్ చేశారని తెలుస్తోంది. మొత్తాన్ని ముట్ట జెప్పిన అనంతరం కలెక్టర్‌తో మాట్లాడి ఆఘమేఘాల మీద కోరుకున్న చోటే వేయించుకున్నారు.

Advertisement
Advertisement