చౌటుప్పల్‌లో కిడ్నాప్‌ కలకలం..! | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్‌లో కిడ్నాప్‌ కలకలం..!

Published Sun, Jul 17 2016 8:40 PM

The kidnap insisted in chowtuppal

చౌటుప్పల్‌:
చౌటుప్పల్‌లోని భాస్కర్‌ సినిమా థియేటర్‌ పంపకంలో తలెత్తిన వివాదం ఓ పార్టనర్‌ కిడ్నాప్, బెదిరింపులకు దారితీసింది. మాజీ మావోయిస్టు నయీం అనుచరులుగా భావిస్తున్న ఎనిమిది మందిని ఆదివారం చౌటుప్పల్‌ పోలీసులు వెంబడించి పట్టుకోవడం నల్లగొండ జిల్లాలో సంచలనం రేకెత్తించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. భాస్కర్‌ థియేటర్‌ పంపకంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. న యీం అనుచరుడిగా భావిస్తున్న వ్యక్తి శనివారం థియేటర్‌ యజమానుల్లో ఒకరైన మంచికంటి భాస్కర్‌కు ఫోన్‌చేసి, సురేశ్‌గా పరిచయం చేసుకున్నాడు. పంచాయతీ సెటిల్‌ చేసుకోమని బెదిరించాడు.  మూడు నాలుగు రోజులుగా ఫోన్లు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 11గంటల సమయంలో స్కార్పియోలో ఎనిమిది మంది వ్యక్తులు చౌటుప్పల్‌కు వచ్చారు.

భాస్కర్‌ ఇంటి సమీపంలో వాహనాన్ని ఆపి, అందులోంచి ఇద్దరు వ్యక్తులు భాస్కర్‌ ఇంటికి వెళ్లారు. ఇంటిముందు తచ్చాడుతూ.. అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. పోలీసులకు సమాచారం అందింది. వారు వచ్చి ఎవరని ప్రశ్నించగా, స్థానికులమే అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డికి సమాచారమందడంతో,  ఆయన ఆదేశాల మేరకు చౌటుప్పల్‌ పోలీసులు వారిని వెంబడించారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద పట్టుకున్నారు. స్కార్పియోను, అందులోని రెండు కర్రలు, ఒక రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని జిల్లా కేంద్రంలోని సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వీరిని విచారిస్తున్నారు. మంచికంటి భాస్కర్‌ తన కు బెదిరింపు కాల్స్‌ రావడంపై జిల్లా ఎస్పీ ప్రకాష్‌రెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేసిన ట్లు తెలిసింది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement